మోడీ గో బ్యాక్.. నల్లజెండాలతో నిరసనలు: కారులో నుంచి జెండాలను చూస్తూ వెళ్లిన ప్రధాని
గువాహటి: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అసోంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆయనకు నల్లజెండాలతో ప్రదర్శన నిర్వహించారు. ఆయన కాన్వాయ్ సమీపంలోనే వారు నల్లజెండాలతో నిరసన ప్రదర్శనలను చేపట్టారు. అసోం రాజధాని గువాహటిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పౌర బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఈ ఆందోళనను చేపట్టారు.
ఈశాన్య రాష్ట్రాల పర్యటన కోసం శుక్రవారం సాయంత్రం మోడీ.. గువాహటికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ లోని జల్ పాయ్ గురిలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో ఆయన అక్కడి నుంచి నేరుగా గువాహటికి వచ్చారు. రెండు రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తారు. స్థానిక లోకోప్రియ గోపీనాథ్ బర్దోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆయన రాజ్ భవన్ కు వెళ్తుండగా.. అఖిల అస్సాం విద్యార్థి సంఘం (ఎఎఎస్ యు) ప్రతినిధులు నల్లజెండాలతో నిరసనలన తెలియజేశారు.
ప్రధాని కాన్వాయ్ వెళ్తున్న మార్గంలోనే గువాహటి విశ్వవిద్యాలయం ఉంది. ఈ విశ్వవిద్యాలయం ముందు నుంచే కాన్వాయ్ వెళ్లాల్సి ఉంటుంది. కాన్వాయ్ యూనివర్శిటీ క్యాంపస్ సమీపానికి చేరుకోగానే.. విద్యార్థి సంఘం నాయకులు, ప్రతినిధులు నల్లజెండాలను ప్రదర్శించారు. ప్రధానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోడీ గో బ్యాక్, జై అయి అసోం అంటూ నినాదాలతో సంఘటనాప్రదేశాన్ని మారుమోగించారు.
దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రధాని కారు అద్దంలోకి చూస్తుండగా.. విద్యార్థులు నల్లజెండాలను ప్రదర్శిస్తున్న ఫొటోలు అవి. బీజేపీకి చెందిన స్థానిక నాయకులు విద్యార్థులను అడ్డుకోవడం కూడా ఈ ఫొటోల్లో కనిపించింది. దీనితోపాటు- అసోం మంత్రులు సిద్ధార్థ భట్టాచర్య, పిజూష్ హజారికా కూడా సంఘటనా స్థలంలో ఉన్నట్లు గుర్తించారు.
ముందు జాగ్రత్త చర్యగా యూనివర్శిటీ అధికారులు ప్రధాన గేట్లను మూసివేశారు. దీనితో మరికొంతమంది విద్యార్థులు క్యాంపస్ నుంచి బయటకి రావడానికి అవకాశం లేకుండా పోయిందని, అధికారులు తమపై దౌర్జన్యం చేశారని విద్యార్థి సంఘం ముఖ్య సలహాదారు సమ్ముజ్వల్ భట్టాచార్య ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగం తమను నిర్బంధించడానికి ప్రయత్నించిందని, అయినా తమ ఆందోళనలో మార్పు ఉండదని చెప్పారు.
పౌర సత్వ బిల్లులో ప్రతిపాదిత సవరణలను వెనక్కి తీసుకునేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని భట్టాచర్య చెప్పారు. సవరణ ప్రతిపాదనలు తమ రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాసేలా ఉన్నాయని, స్వేచ్ఛను హరిస్తాయని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలను నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తామని అన్నారు. కృషక్ ముక్తి సంగ్రామ్ సమతి ప్రతినిధులు కూడా ఈ ఆందోళనల్లో భాగస్వామ్యులయ్యారు. ప్రధాని రాకను నిరసిస్తూ వారు కూడా నల్లజెండాలను ప్రదర్శించారు.