PMC Bank Scam:నిరసనల్లో పాల్గొని గుండెపోటుతో మృతి చెందిన ఖాతాదారుడు
ముంబై: పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంతో చాలా మంది ఖాతాదారులు రోడ్డున పడ్డారు. తమ డబ్బు తాము తీసుకునేందుకు వీలులేకపోవడంతో వారి అవసరాలకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్ది రోజులుగా ఖాతాదారులు పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు వద్ద నిరసనలు చేపడుతున్నారు. నిరసనల్లో పాల్గొన్న సంజయ్ గులాటీ అనే 51 ఏళ్ల వ్యక్తి ఇంటికి రాగానే గుండెపోటు రావడంతో మృతి చెందారు.
విన్నారా: ఠాక్రే ఆస్తి కంటే మహారాష్ట్ర సీఎం ఆస్తి ఇంత తక్కువా ? ఆశ్చర్యం
ముంబైలోని ఓషివారా ప్రాంతంలో నివాసముండే సంజయ్ గులాటీ పీఎంసీ బ్యాంకులో డబ్బులు దాచుకున్నాడు. మొత్తం 90 లక్షల వరకు ఓషీవారా పీఎంసీ బ్రాంచ్లోని అతని ఖాతాలో ఉన్నాయి. అయితే విధి వెక్కిరించడంతో సంజయ్ గులాటీ పరిస్థితి క్లిష్టంగా మారింది. జెట్ ఎయిర్వేస్లో ఉద్యోగం చేస్తున్న సంజయ్ గులాటీ, ఆ సంస్థ సంక్షోభంలోకి కూరుకుపోవడంతో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు.ఆ తర్వాత ఆర్బీఐ పీఎంసీ ఖాతాదారుల నగదు విత్డ్రాల్పై ఆంక్షలు విధించడంతో మళ్లీ దెబ్బపడింది. ఆయన కుటుంబ సభ్యులు నలుగురికి ఈ బ్యాంకులో ఖాతాలున్నాయి. అందులో రూ. 90 లక్షలు ఉన్నాయి.
సంజయ్ గులాటీ కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆ అబ్బాయి చికిత్స కోసం తరుచూ డబ్బులు అవసరం అవుతుందని సంజయ్ బంధువు ఒకరు చెప్పారు. గత కొన్ని రోజులుగా సంజయ్ చాలా ఆవేదనతో ఉన్నట్లు బంధువు రాజేష్ దువా తెలిపాడు. తన ఖాతా నుంచి తన డబ్బును విత్డ్రా చేసుకోలేక పోవడంపై చాలా బాధపడేవాడని కుమారుడి చికిత్స ఎక్కడ ఆగిపోతుందో అనే భయం అతనిలో కనిపించేదని రాజేష్ చెప్పాడు.
ఫోర్టు ఏరియాలోని కిల్లా కోర్టులో దాదాపు 200 మంది పీఎంసీ ఖాతాదారులు నిరసన తెలిపారు. ఆ సమయంలో పీఎంసీ బ్యాంకులో స్కామ్కు పాల్పడిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు. ఇక్కడ నిరసనల్లో పాల్గొన్న సంజయ్ గులాటీ... మధ్యాహ్నం తిరిగి ఇంటికి చేరుకున్నారు. భోజనం వడ్డించమని భార్యతో చెప్పినట్లు రాజేష్ తెలిపాడు. భోజనం చేస్తున్న సమయంలో గుండెపోటు రావడంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. అయితే మార్గమధ్యంలోనే గులాటీ చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఇదిలా ఉంటే పీఎంసీ బ్యాంకు ఖాతాదారుడు ఇకపై రూ.40వేలు విత్డ్రా చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. అంతకుముందు రూ. 25వేలుగా ఉన్న విత్డ్రాల్ పరిమితిని ఎత్తివేసింది.