మహేష్ పిస్టల్ విలువ రూ.1.50 లక్షలు: జీతం రూ.8 వేలు, ఎపి లింక్?
బెంగళూరు: బెంగళూరు నగరంలోని కాడుగోడిలో ఉన్న ప్రగతి కాలేజ్ విద్యార్థిని గౌతమి (18)ని హత్య చేసిన అటెండర్ మహేష్ ను పోలీసులు విచారిస్తున్నారు. అతని దగ్గర ఉన్న పిస్తోల్, సజీవంగా ఉన్న ఆరు బుల్లెట్ లు స్వాదీనం చేసుకున్నామని బెంగళూరు తూర్పు విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ హరిశేఖరన్ చెప్పారు.
ప్రగతి కాలేజ్ లో అటెండర్ గా పని చేస్తున్న మహేష్ నెల జీతం రూ. 8 వేలు. గౌతమిని హత్య చెయ్యడానికి అతను ఉపయోగించిన నాటు పిస్తోల్ విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందని పోలీసు అధికారులు అంటున్నారు. రూ. 8 వేలు జీతం తీసుకునే వ్యక్తి దగ్గర ఇంత విలువైన పిస్తోల్ ఏలా వచ్చింది అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.
బీహార్, అస్సాం, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లలో ఇలాంటి నాటు పిస్తోల్ లు తయారు చేస్తారని పోలీసు అధికారులు అంటున్నారు. పిస్తోల్ ఎవరి దగ్గర ఇతను కొనుగోలు చేశాడు అని కచ్చితంగా తెలియడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరు లేదా శివమొగ్గలో మహేష్ పిస్తోల్ కొనుగోలు చేసి ఉంటాడని పోలీసు అధికారులు చెబుతున్నారు.
రెండు సంవత్సరాల క్రితం తాను కేఆర్ పురం రైల్వేష్టేషన్ దగ్గర పిస్తోల్ కొనుగోలు చేశానని మహేష్ అంటున్నాడని దర్యాప్తు చేస్తున్న పోలీసులు అంటున్నారు. అయితే కేఆర్ పురం రైల్వే స్టేషన్ దగ్గర పిస్తోల్ కొనుగోలు చేసే అవకాశం లేదని పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేఆర్ పురం రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొన్ని వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారిలో ఎవరైనా మహేష్ కు రివాల్వర్ విక్రయించారా అనే కోణంలో పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే స్థానికులను కొందరిని విచారణ చేసి వివరాలు సేకరించారు.
కచ్చితంగా ఇతను శివమొగ్గ నుండి పిస్తోల్ తీసుకు వచ్చాడని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని పూర్తి విచారణ చేసి అన్ని వివరాలు వెళ్లడిస్తామని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు.