బెంగళూరు శివార్లలో పరువు హత్య, తక్కువ కులం వాడితో లవ్, చంపేసి బూడిద చేసిన తండ్రి !
తక్కువ కులం వాడిని ప్రేమించిందని రెచ్చిపోయిన తండ్రిఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులు, వెంటాడి కుమార్తెను పట్టుకున్నాడుకర్రలతో కొట్టి చంపేశాడు, బెంగళూరు నగర శివార్లలోని పోలంలో కుమార్తెను బూడిద చేశాడు
బెంగళూరు: కర్ణాటకలో పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తక్కువ కులం వారిని ప్రేమించారని సహించలేక యువతులను వారి కుటుంబ సభ్యులు అతి దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా బెంగళూరు నగర శివార్లలో ఓ అమ్మాయి తండ్రి చేతిలో దారుణ హత్యకు గురైయ్యింది.
బెంగళూరు గ్రామీణ జిల్లా లక్కప్పనహళ్ళిలో లక్ష్మినారాయణ (20), లక్ష్మిదేవి (16) నివాసం ఉంటున్నారు. లక్ష్మినారాయణ, లక్ష్మిదేవి ప్రేమించుకున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. అయితే లక్ష్మిదేవి కంటే లక్ష్మినారాయణ తక్కువ కులం వాడు.
లక్ష్మినారాయణ, లక్ష్మిదేవి ప్రేమ వ్యవహారం ఆమె తండ్రి చిక్కనరసింహయ్యకు తెలిసింది. లక్ష్మిదేవిని చితకబాదిన ఆమె తండ్రి చిక్కనరసింహయ్య స్నేహితుడి సహాయంతో లక్ష్మినారాయణను పిలిపించి జాగ్రత్తగా ఉండాలని, నా కుమార్తెతో ఇంకో సారి మాట్లాడితే చంపేస్తానని హెచ్చరించాడు. నెల క్రితం లక్ష్మినారాయణ, లక్ష్మిదేవి ఊరి నుంచి పారిపోయారు.
విషయం తెలుసుకున్న లక్ష్మిదేవి తండ్రి చిక్కనరసింహయ్య గాలించి కుమార్తెను పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు. కర్రలతో లక్ష్మిదేవి మీద తీవ్రంగా దాడి చెయ్యడంతో ఆమె మరణించింది. గుట్టుచప్పుడు కాకుండా లక్ష్మిదేవి మృతదేహాన్ని పోలంలోకి తీసుకెళ్లి బూడిద చేశాడు.
లక్ష్మిదేవి కనిపించకపోవడంతో ఆమె ప్రియుడు లక్ష్మినారాయణకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు లక్ష్మిదేవి తండ్రి చిక్కనరసింహయ్యను విచారణ చెయ్యగా అతను పొంతనలేని సమాధానం చెప్పాడు. చివరికి కుమార్తెను హత్య చేశానని అంగీకరించడంతో చిక్కనరసింహయ్యను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.