శశికళ సెల్ఫ్ గోల్: సెంట్రల్ జైలు దగ్గర గొడవలకు కిరాయి ఇచ్చారంట !
బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శశికళ లొంగిపోయే సమయంలో జరిగిన అల్లర్ల వెనుక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అనుచరుల హస్తం లేదని, అత్తిబెలేకి చెందిన ఓ రౌడీషీటర్ కు కిరాయి ఇచ్చి కావ
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు దగ్గరకు వచ్చిన సమయంలో జరిగిన గొడవల వెనుక పెద్ద ప్లాన్ ఉందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
సాధించిన శశికళ: బెంగళూరు జైల్లో చిన్నమ్మకు ఇవన్నీ ఓకే
శశికళ జైలు దగ్గరకు వచ్చిన సమయంలో ఆమె అనుచరులు ప్రయాణిస్తున్న వాహనాలను కొందరు అల్లరిమూకలు ధ్వంసం చేసిన విషయం తెలిసింది. ఈ దాడుల వెనుక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆయన అనుచరుల హస్తం ఉందని అప్పట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని బెంగళూరు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
గొడవకు కారణం అత్తిబెలే రౌడీషీటర్
శశికళ పరప్పన అగ్రహార జైలు దగ్గరకు వచ్చి లోంగిపోయే సమయంలో దారిలో ఆమె అనుచరులు వస్తున్న కార్ల మీద కొందరు రాళ్లు, చెప్పులు, కర్రలతో దాడి చేశారు. ఐదు స్కార్పియో కార్లు, ఓ ఇన్నోవా కారును ధ్వంసం చేశారు. పలు వాహనాలను మీద దాడులు చేశారు. ఈ గొడవలకు ప్రధానకారకుడు అత్తిబెలేకి చెందిన ఓ రౌడీషీటర్ అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
సుపారి ఇచ్చి మరీ గొడవ చేయించారు
శశికళ జైల్లో లొంగిపోయే సమయంలో అత్తిబెలేకి చెందిన రౌడీషీటర్ కు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు దగ్గర అల్లర్లు సృష్టించాలని ముందుగానే సుపారి (కిరాయి) ఇచ్చారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. సుపారి తీసుకున్న రౌడీషీటర్ తన అనుచరులతో కలిసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు దగ్గర నానా హంగామా చేశాడని పోలీసులు అంటున్నారు.
పక్కా ప్లాన్ తో గొడవ
అత్తిబెలే రౌడీషీటర్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ఈనెల 15వ తేదీ బుధవారం సాయంత్రం జైలు దగ్గర గొడవలు చేసిన నలుగురిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఆ నలుగురు అత్తిబెలే రౌడీషీటర్ బండారం బయటపెట్టారని పోలీసులు అంటున్నారు.
శశికళను తమిళనాడుకు తరలించడానికే !
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు భద్రత ఉండదని అందరికీ ప్రచారం చెయ్యాలనే పక్కా ప్లాన్ తో రౌడీషీటర్ కు సుపారి ఇచ్చి గొడవలు చేయించారని పోలీసులు అంటున్నారు. శశికళను తమిళనాడుకు తరలించడానికే ఆ రోజు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు రహదారిలో గొడవలు చేశారని పోలీసులు ఆధారాలు సేకరించారు.
సుపారి ఎవరు ఇచ్చారు ?
అత్తిబెలే రౌడీ షీటర్ కు సుపారి ఇచ్చి గొడవలు చెయ్యమని చెప్పారని ఇప్పటికే పట్టుబడిన నలుగురు నిందితులు అంగీకరించారని, అయితే సుపారి ఇచ్చిన వ్యక్తి ఎవరు ? అనే విషయం ఇప్పటి వరకు వెలుగుచూడలేదని, రౌడీషీటర్ పట్టుబడిన తరువాత అసలు విషయం వెలుగు చూస్తుందని పోలీసు అధికారులు అంటున్నారు.
శశికళ సెల్ఫ్ గోల్ ?
అయితే శశికళను చాకచక్యంగా పక్కా ప్లాన్ తో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి చెన్నైలోని పుళల్ సెంట్రల్ జైలుకు తరలించడానికి ప్రయత్నించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రౌడీషీటర్ పట్టుబడితే సుపారి ఇచ్చింది శశికళ అనుచరులా ? కాదా ? అనే విషయం వెలుగుచూడనుంది.
పోలీసుల అదుపులో రౌడీషీటర్ అనుచరులు ?
అత్తిబెలేకి చెందిన రౌడీషీటర్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఆ రౌడీషీటర్ ఇప్పటికే తమిళనాడు పారిపోయాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారు.