ముందు హత్య..ఇప్పుడు గుండెపోటు: తబ్రేజ్ హత్యకేసులో 11 మంది పేర్లు తొలగింపు
జార్ఖండ్ : నాలుగు నెలల క్రితం జార్ఖండ్లో ఓ గ్రామంలో తబ్రేజ్ అన్సారీ అనే యువకుడు దొంగతనానికి వచ్చాడన్న ఆరోపణలపై స్థానికులు కట్టేసి దాడి చేయడంతో తబ్రేజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో పోలీసులు 11 మందిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.ఇప్పుడు ఆ 11 మంది పేర్లను చార్జ్షీట్ నుంచి తొలగించారు. ముందుగా ఆ 11 మంది దాడి చేయడంతోనే తబ్రేజ్ మృతి చెందాడని తెలిపిన పోలీసులు, తాజాగా గుండెపోటుతో తబ్రేజ్ మృతి చెందాడంటూ పోస్టుమార్టం నివేదికను ఆధారం చేసుకుని వారి పేర్లను తొలగించారు పోలీసులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
కశ్మీర్ అంశంపై ట్రంప్ ఇస్తున్న ఆఫర్ ఏంటి..? మళ్లీ తుట్టెను కదుపుతున్నారా..?
" తబ్రేజ్ మృతిపై రెండు కారణాలు పేర్కొంటూ 11 మంది పేర్లు చార్జ్షీట్ నుంచి తొలగించాం. ఒకటి తబ్రేజ్ చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో మృతించెందాడని మెడికల్ రిపోర్టులు తెలుపుతున్నాయి. రెండోది తబ్రేజ్ను చంపాలన్నది గ్రామస్తుల ఉద్దేశం కాదు. తబ్రేజ్ గుండెపోటు, తలపై బలమైన గాయం తగలడంతో మృతి చెందాడని రెండో మెడికల్ రిపోర్టు కూడా పేర్కొంది " అని సరాయ్కేలా - ఖర్సవాన్ ఎస్పీ తెలిపారు.
జూన్ 18న దొంగతనం చేసేందుకు వచ్చాడని ఆరోపణలు చేస్తూ తబ్రేజ్ అన్సారీని గ్రామస్తులు ఓ స్తంభానికి కట్టేశారు. జైశ్రీరామ్ , జై హనుమాన్ అని నినదించాల్సిందిగా బలవంతం చేశారు. దాడి చేశాక పోలీసులకు అప్పగించారు. నాలుగురోజుల అనంతరం తబ్రేజ్ తీవ్రగాయాలతో బాధపడుతుండగా హాస్పిటల్కు చికిత్స కోసం పంపారు. అక్కడే తబ్రేజ్ మృతి చెందాడు. తబ్రేజ్ పై దాడిచేయడంతో తలలో తీవ్రరక్తస్రావం జరిగిందని దీంతో ఆయన మృతి చెందినట్లు జూన్ 25న వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. అయితే ఫోరెన్సిక్ టెస్టుల రిపోర్టులు కూడా రావాల్సి ఉండగా వైద్యులు పోస్టుమార్టం నివేదికను అధికారికంగా బయటపెట్టలేదు.
ఇదిలా ఉంటే తబ్రేజ్పై ఒక కేసు ఆయనపై దాడిచేసిన వారిపై హత్యకేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు చెప్పడంతో వారందరి పేర్లను చార్జ్షీట్ నుంచి తొలగించినట్లు వెల్లడించారు.