రాజకీయ సంక్షోభం?.. క్షణ క్షణం ఉత్కంఠ.. అసలేం జరగబోతుంది!?
ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ.. ఆయన మాట చెల్లని పరిస్థితి నెలకొంది. మరోవైపు శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా.. ఆమెకు అధికార హోదా లేదు.
చెన్నై: అన్నాడీఎంకెలో ఆధిపత్య పోరు తమిళనాడులో రాజకీయ సంక్షోభం దిశగా సాగుతోంది. పన్నీర్ సెల్వం-శశికళ మధ్య నడుస్తోన్న వార్తో.. అధికార యంత్రాంగం సైతం ఎవరి మాట వినాలో తెలియని పరిస్థితిలో ఉంది.
ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ.. ఆయన మాట చెల్లని పరిస్థితి నెలకొంది. మరోవైపు శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా.. ఆమెకు అధికార హోదా లేదు. కేబినెట్ మంత్రులు సైతం ఎవరి పక్షం ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తేలలేదు.
శశికళ మాత్రం తనవైపు 134మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతోన్న పరిస్థితి. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంతో దర్శనమివ్వడంతో.. పన్నీర్ కు మరింత మంది ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతుందా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.

ప్రస్తుతం అన్నాడీఎంకె ఎమ్మెల్యేలందరితో శశికళ కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తే గనుక.. శశికళ సీఎం పీఠం అధిష్టించడానికి అనుకూలత ఏర్పడుతుంది.
ఒకవేళ పన్నీర్ సెల్వం గనుక 25-30మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోగలిగితే.. ఇరు వర్గాల మధ్య బల నిరూపణ జరిగే అవకాశం కూడా ఉంది. అదే గనుక జరిగితే పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి డీఎంకె కూడా పన్నీర్కు మద్దతునిచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ రాజకీయ సంక్షోభం గనుక తలెత్తితే.. గవర్నర్ రాష్ట్రపతి పాలన కోసం సిఫారసు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే, శశికళ మాత్రం తనను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరు అని పార్టీ కేడర్ తో ధీమా వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం అన్నాడీఎంకె ఎమ్మెల్యేలు, మంత్రులు పోయెస్ గార్డెన్ కు క్యూ కట్టిన నేపథ్యంలో..మరికొన్ని గంటల్లో శశికళ వెనుక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానిపై స్పష్టత రానుంది.












Click it and Unblock the Notifications