మోడీ ఛాపర్ తనిఖీ చేసిన ఐఏఎస్పై సస్పెన్షన్ ఎత్తివేత
ఢిల్లీ : ఒడిశాలో ప్రధాని మోడీ హెలికాప్టర్ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారి మహ్మద్ మొహిసిన్ సస్పెన్షన్ను ఎలక్షన్ కమిషన్ ఎత్తివేసింది. ఆయన సస్పెన్షన్పై బెంగళూరులోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్.. క్యాట్ స్టే విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్పై స్టే ఇచ్చిన క్యాట్.. ఈసీతో పాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణ జూన్ ఆరో తేదీకి వాయిదా వేసింది.
క్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు
మొహసీన్ కేసులో ఉత్తర్వులు జారీచేసిన క్యాట్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎస్పీజీ ప్రొటెక్షన్ ఉన్న వారు ఏమైనా చేసేందుకు అర్హులన్న అభిప్రాయం సరికాదని అభిప్రాయపడింది. కర్నాటక సీఎం కుమారస్వామి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వాహనాలను సైతం అధికారులు తనిఖీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని క్యాట్ ప్రశ్నించింది.
ఎన్నికల విధులకు దూరం
ఇదిలా ఉంటే మొహసిన్ సస్పెన్షన్పై బెంగళూరులో క్యాట్ స్టే ఇచ్చిన కొద్దిసేపటికే ఈసీ మొహిసిన్ ఎన్నికల విధులు నిర్వహించకుండా నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు అందే వరకు ఆయన ఎలక్షన్ విధులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని కర్నాటక సర్కారుకు ఈసీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
ప్రధాని చాపర్ తనిఖీతో వేటు
కర్నాటక కేడర్కు చెందిన మొహసిన్ను ఎలక్షన్ కమిషన్ ఒడిశాలో ఎన్నికల పరిశీలకునిగా నియమించింది. విధుల్లో భాగంగా ఈ నెల 16న ఆయన ఒడిశాలోని సంబల్పూర్లో మోడీ హెలికాప్టర్ను తనిఖీ చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. అయితే ఎస్పీజీ రక్షణ ఉన్న వ్యక్తుల హెలికాప్టర్ను తనిఖీ చేయడం నిబంధనలకు విరుద్ధమంటూ ఎలక్షన్ కమిషన్ మొహసీన్పై వేటు వేసింది.