బీహార్ ఎన్నికల్లో హామీలను నమ్మని ఓటర్లు- సీఎం అభ్యర్దుల కంటే వారి పాలన ఆధారంగానే ఓటు..
బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడం, ఈసీ తీసుకుంటున్న భారీ చర్యల మధ్య బీహారీలు ఓటేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు రెండు ప్రధాన కూటములు సర్వశక్తులొడ్డుతున్నాయి. వీరిలో ఎవరికి ఓటర్ల ఆదరణ ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
బీహార్ ఎన్నికల సంగ్రామాన్ని దగ్గరి నుంచి గమనిస్తే ఓటర్లు ప్రధాన కూటములు, వాటి నేతలు ఇస్తున్న హామీలను నమ్మేందుకు అసలు సిద్దంగా లేరని తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం అభ్యర్ధులుగా ఉన్న నితీశ్ కుమార్ కానీ తేజస్వియాదవ్ కానీ ఇస్తున్న హామీలను వారు పట్టించుకోవడం లేదని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. నితీశ్, తేజస్వీ పదే పదే జపిస్తున్న అభివృద్ధి మంత్రం కూడా వారిని ఆకట్టుకోలేకపోతున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో వీరు కూడా కొత్త దారులు వెతుక్కునే పనిలో పడ్డారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆయా పార్టీల పాలనలో తాము ఎదుర్కొన్న అనుభవాలనే ప్రధానంగా ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు తాజాగా తెలుస్తోంది. గతంలో 15 ఏళ్ల పాటు సాగిన ఆర్జేడీ పాలన తర్వాత 15 ఏళ్లుగా నితీశ్ కుమార్ పాలన సాగుతోంది. ఈ రెండు పాలనల్లో వ్యత్యాసం, తమ జీవన స్ధితిగతుల్లో వచ్చిన మార్పులనే ఓటర్లు ప్రామాణికంగా చేసుకుంటున్నట్లు తాజా పరిణామాలు చెబుతున్నాయి.

Recommended Video
బీహార్ ఓటర్లకు నేతలు ఇస్తున్న హామీలను ఓటర్లు పట్టించుకోవడం లేదనడానికి తేజస్వీ 10 లక్షల ఉద్యోగాల హామీనే ఉదాహరణగా చెప్పవచ్చు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వి చెబుతుండగా.. దాన్ని నమ్మేందుకు ఓటర్లు అసలు ఇష్టపడటం లేదు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇది సాధ్యం కాదనే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాగే గతంలో ఎన్డీయే కూటమి తరఫున ప్రధాని మోడీ ఇచ్చిన 1.25 లక్షల కోట్ల బీహార్ ప్యాకేజీ హామీ ఏమైందని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు లాక్ డౌన్ సందర్భంగా బీహార్కు వలసవచ్చిన లక్షలాది మంది వలస కార్మికుల కష్టాలు కూడా ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications