జోష్: పన్నీర్ గూటికి పొన్నియన్, హీరో శరత్ కుమార్ మద్దతు
పన్నీర్ సెల్వం గూటికి ఒక్కరొక్కరే వచ్చి చేరుతున్నారు. తాజాగా, సీనియర్ నేత పొన్నియన్ ఆయనకు బాసటగా నిలుస్తూ ప్రకటన చేశారు. హీరో శరత్ కుమార్ మద్దతు ప్రకటించారు.
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శిబిరం జోష్లో ఉంది. ఒక్కరొక్కరే ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. తాజాగా అన్నాడియంకె వ్యవస్థాపక సభ్యుడు, సీనియర్ సభ్యుడు పొన్నియన్ పన్నీర్ సెల్వం గూటికి చేరుకున్నారు. ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. హీరో శరత్ కుమార్ కూడా పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించారు.
త్వరలో తమిళనాడు సంక్షోభం ముగుస్తుందని, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పొన్నియన్ అన్నారు. పార్లమెంటు సభ్యులు అశోక్ కుమార్, పిఆర్ సుందరం పన్నీర్ గూటికి చేరిన విషయం తెలిసిందే. పన్నీరును అమ్మ నమ్మింది కాబట్టి మనం కూడా నమ్మాలని పొన్నియన్ అన్నారు.
పన్నీరుకు పగ్గాలు అప్పగించడం తమిళనాడుకు మంచిదని అన్నారు. అమ్మ ఆశయాలను పన్నీరు సెల్వ నెరవేరుస్తారని ఆయన చెప్పారు. పార్టీలో పన్నీరుకు సీనియారిటీ ఉండడమే కాకుండా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని ఆయన అన్నారు. శశికళ వర్గంలోని శానససభ్యులు చాలా మంది తమ వైపు వస్తున్నట్లు ఆయన తెలిపారు.
లోకసభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తప్ప పార్టీ ఎంపీలంతా సెల్వం గూటికి చేరుతున్నట్లు ఇద్దరు ఎంపీలు అశోక్ కుమార్, సుదరం చెప్పారు. లేచింది మొదలు నియోజకవర్గంలో తిరగాలంటే సెల్వం గూటికి చేరడమే మంచిదని అశోక్ కుమార్ అన్నారు. ప్రత్యర్థి వర్గంలో చేరితే తినే కూరల్లో ఉప్పు ఉందా అని ప్రజలను తనను ప్రశ్నిస్తారని ఆయన అన్నారు. జయ మృతిపై సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
అమ్మ తమను వదిలిపోయిన రోజున అందరూ కన్నీటి సముద్రంలో మునిగిపోతే శశికళ మాత్రం 15 మంది కుటుంబ సభ్యులను వెంట పెట్టుకుని వచ్చారని మరో ఎంపీ సుందరం అన్నారు. తాము ఒకరినొకరం చూసుకునే లోపలే వారందరూ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే విషయంపై చర్చలు ప్రారంభించారని ఆయన చెప్పారు. శశికళ కంట్లోంచి చుక్క నీరు కూడా రాలేదని ఆయన అన్నారు. ఆమ్మను దగ్గరగా చూసేందుకు కూడా శశికళ అనుమతించలేదని అన్నారు.