పోస్టర్ స్టోరీ: రాముడిగా మోడీ, రావణాసురుడిగా పాక్ ప్రధాని
న్యూఢిల్లీ: భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్తో సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆర్మీ సర్జికల్ స్ట్రయిక్స్ ఉత్తదేనని దానికి సంబంధించిన వీడియోలు విడుదల చేయాలన్నఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల నేతలు కోరిన నేపధ్యంలో బీజేపీ కూడా కాస్తంత ఘాటుగానే స్పందిస్తోంది.
వారణాసిలో వెలసిన పోస్టర్లు
దీనికి తోడు దసరా పండుగ సమీపిస్తోంది. ఈ క్రమంలో బుధవారం వారణాసిలో వెలసిన ఓ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీకి చెందిన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లో ప్రధాని నరేంద్రమోడీని యుద్ధం చేస్తోన్న రాముడిగా చిత్రీకరించారు.
రావణాసురుడిగా పాక్ ప్రధాని
పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను రావణాసురుడిగా పేర్కొంటూ 'ఓరీ.. రావణా కాసుకో.. ఇంకా ఒకేఒక్క సర్జికల్ స్ట్రయిక్ బాణంతో నీ కథ ముగుస్తుంది'అని రాముడు(మోడీ) హెచ్చరిస్తున్నట్లు పోస్టర్లు వెలిశాయి.
రావణుడి కొడుకు మేఘనాథుడిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలను విడుదల చేయాలని ప్రకటన చేసిన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను రావణుడి కొడుకు మేఘనాథుడిగా పోస్టర్లో పేర్కొన్నారు. పాకిస్థాన్పై భారత సైన్యం మరోసారి సర్జికల్ స్ట్రయిక్స్ జరపాల్సిందేనని కూడా ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.
అది దేశద్రోహమే: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి
ఇదిలా ఉంటే ఉగ్రవాది హఫీజ్ సయీద్ డిమాండ్ చేస్తున్నట్లే కేజ్రీవాల్ కూడా సర్జికల్ దాడుల సాక్ష్యాధారాలు అడుగుతున్నారని, ఒకరకంగా అది దేశద్రోహమేనని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు.