బీజేపి అమ్ములపొదిలో ప్రభాస్ అస్త్రం.!దక్షిణ భారతంపై ప్రభావం.!అందుకే క్రిష్ణంరాజుకు కీలక బాద్యతలా.?
హైదరాబాద్ : దక్షిణ భారత రాజకీయాలంటే భారతీయ జనతా పార్టీకి చెప్పలేనంత ఆసక్తి. దేశంలో అన్ని ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నా దక్షిణ బారత దేశం మీద ఎందుకు అంత ప్రభావం చూపలేకపోతున్నామని భారతీయ జనతాపార్టీ పెద్దలు మదనపడిపోతుంటారు. అధికారం చేజిక్కించుకునేందుకు సమయం చిక్కినప్పుడల్లా అలుపెరగని ప్రయాత్నాలు చేస్తూనే ఉంటుంది బీజేపి. ఇక మోదీ మేనియా మొదలైన దగ్గరనుండి దక్షిణ బారతంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అధికారం కోసం విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది బారతీయ జనతా పార్టీ. తాజాగా సౌత్ లో మంచి ప్రజాకర్షణ, సామాజిక వర్గ అండ ఉన్న ఓ కధానాయకుడితో ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్లాలని బీజేపి పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
కృష్ణం రాజుకు గవర్నర్ పదవి.. బీజేపి వ్యూహం వెనక అపలు మతలబు..
రాజకీయ పార్టీలకు అధికార దాహం కాస్త ఎక్కువగానే ఉంటుంది. మెజారిటీ రాష్ట్రాల్లో ఆదిపత్యం చాటుకుని అధికారంలోకి వచ్చినప్పటికి ఓడిపోయిన రాష్ట్రాలమీద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఉంచుతాయి పార్టీలు. అచ్చం ఇలాగే వ్యవహరిస్తోంది భారతీయ జనతా పార్టీ. అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఆదిపత్యం కనబరిచినా దక్షిణ బారతం మీద ఎందుకు ప్రభావం చూపడంలేదని భారతీయ జనతా పార్టీ మదనపడిపోతోంది. సమయంతో పాటు సౌత్ లో ఛరిష్మా ఉన్న నాయకుడు దొరికనప్పుడు దక్షిణ భారత దేశాన్ని కూడా కాషాయ మయం చేయాలని వ్యూహాలు రచిస్తోంది బీజేపి.
మోదీ అంచనా.. బాహుబలి రీచ్ అవుతాడా.?
ప్రధాని నరేంద్ర మోదీ దూరపు చూపు, రాజకీయ చతురత, వ్యూహాలు అంత తొందరగా ఎవ్వరికి అంతు చిక్కవు. రాజకీయాల్లో ఎవరైనా రాణిస్తారని మోదీకి అనిపిస్తే కొన్ని సంవత్సరాలు వేచి చూసైనా అలాంటి వ్యక్తులకు అనూహ్య అవకాశాలు కల్పించి ఫలితాన్ని రాబడతారు ప్రధాని మోదీ. అచ్చం ఇలాంటి రాజకీయ పరిణామాలే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతంలో చోటు చేసుకోబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. బాహుబలి సినిమాను చూసిన ప్రధాని మోదీ అందులో హీరోగా నటించిన ప్రభాస్ నటనకు ప్రశంసలు కురిపించారు. నిండు పార్లమెంట్ సమావేశాలలో కట్టప్ప పేరును ప్రదాని మోదీ ప్రస్తావించారంటే ఆ సినిమా ప్రధాని మనసులో ఎంత ముంద్ర వేసుకుందో చెప్పొచ్చు.
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రయోగం.. ప్రభాస్ పాచిక పనిచేస్తుందా..?
బాహుబలి రెండవ భాగం విడుదలై విజయవంతంగా ప్రదర్శించిబడుతున్న తరుణంలో హీరో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు కధానాయకుడు ప్రభాస్ ను ప్రధాని మోదీ కి పరిచయం చేసారు. అప్పట్లో ప్రభాస్ ఆశీర్వదించడమే కాకుండా ప్రభాస్ నటనను మోదీ ప్రశంశించారు. అప్పుడే ప్రభాస్ ను చూసిన మోదీ ఓ అవగాహనకు వచ్చి ఉంటారనే చర్చ జరుగుతోంది. సౌత్ లో మంచి ప్రేక్షకాదరణ ఉన్న ప్రభాస్ ను రాబోవు రోజుల్లో పార్టీపరంగా ఉపయోగించుకుని మంచి ఫలితం రాబట్టొచ్చనే నిర్ధారణకు దచ్చి ఉంటారు మోదీ. అందులో భాగంగానే ప్రభాస్ పెదనాన్న,బీజేపి మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజుకు రాజ్యాంగబద్దమైన పదవి కట్టబెట్టడంతో ప్రభాస్ ను గ్రిప్ లో పెట్టుకోవచ్చన్నది బీజేపి వ్యూహాంగా తెలుస్తోంది.
ప్రభాస్ కు కర్చీఫ్ వేయాలంటే ఆయనకు కుర్చీ ఇవ్వాలి.. అదే బీజేపి మాస్టర్ ప్లాన్..
అందుకే పార్టీలో సుధీర్గ కాలం కొనసాగడమే కాకుండా కేంద్ర సహాయ మంత్రిగా పని చేసిన కృష్ణం రాజుకు తమిళనాడు గవర్నర్ గా అవకాశం కల్పించి తద్వారా ప్రభాస్ భవిష్యత్ రాజకీయాలకు ఉపయోగించుకోవాలని బీజేపి ప్రణాళిక రచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా ప్రభాస్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ ఉండడంతో యువ రాజకీయ నేతగా రాణిస్తారనే అంచనాలు వేస్తోంది బీజేపి. అందుకోసం రానున్న ఎన్నికలో ప్రభస్ ను ప్రయోగాత్మకంగా ఉపయోగించుకోవాలంటే కృష్ణం రాజు లాంటి సీనియర్లకు ఏదో ఒక పదవి ఇవ్వాలని బీజేపి కృతనిశ్చయంతో ఉన్నట్టు స్పష్టమవుతోంది. అందుకే గత కొద్ది రోజులుగా కృష్ణం రాజుకు తమిళనాడు గవర్నర్ గా బీజేపి అవకాశం కల్పిస్తోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.