జగన్కు నిరాశే!: టికి సపోర్టన్న బిజెపి, కీలక సవరణలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ ముసాయిదా బిల్లు) విషయంలో భారతీయ జనతా పార్టీ మంగళవారం ఉదయం మరింత స్పష్టత ఇచ్చింది. బిల్లుకు మద్దతిస్తామని తెలిపింది. ఇప్పటి వరకు సమైక్యవాదులు, పలువురు సీమాంధ్ర ప్రాంత నేతలు బిజెపి బిల్లును అడ్డుకుంటుందని భావిస్తూ వస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా బిజెపి పైనే ఆశలు పెట్టుకున్నారు. సీమాంధ్ర టిడిపి నేతలు సైతం సరిగా లేని విభజన బిల్లుకు బిజెపి సహకరించదని భావిస్తూ వచ్చారు. కాని మంగళవారం బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ... తాము తెలంగాణ బిల్లుకు మద్దతిస్తామని ప్రకటించారు.
తమ సవరణలకు అధికార కాంగ్రెసు పార్టీ సానుకూలంగా స్పందించి బిల్లు పాసయ్యేలా చూడాలని కోరారు. కాంగ్రెసు విభజన అంశాన్ని గందరగోళం చేసిందని మండిపడ్డారు. పార్లమెంటులో బిల్లుకు తాము సహకరిస్తామని హామీ ఇచ్చారు. విభజనపై సామరస్య పూర్వకంగా చర్చ జరగాలని కోరారు. మూడు ప్రాంతాలకు పన్ను రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బిల్లులో బిజెపి పలు కీలక సవరణలు
తెలంగాణ ముసాయిదా బిల్లులో బిజెపి ఎనిమిది కీలక సవరణలు చేసినట్లుగా తెలుస్తోంది. 371తో భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి.
భద్రాచలం మినహా పోలవరం ముంపు ప్రాంతాలని సీమాంధ్రకు బదలాయించాలి.
తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.
ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.
పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి.
కొత్త రాజధానికి మొదటి ఏడాది కేంద్రం నిధులివ్వాలి. ఇలా పలు సవరణలు చేశారు.
ఉత్తరాంధ్ర, సీమాంధ్ర ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు పన్ను రాయితీ ఇవ్వాలి.