ప్రకాష్ రాజ్ ను పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని ఈసీకి ఫిర్యాదు ... మ్యాటరేంటంటే
బెంగళూరు సెంట్రల్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు ప్రకాష్ రాజ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసులో అడ్డంగా బుక్ అయిన ఆయన అభ్యర్థిత్వం చెల్లదంటూ తాజాగా ఈసీకి ఫిర్యాదు చేసిన ఘటన కర్ణాటక రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈసీకి ఫిర్యాదు చేసిన ఈ వ్యవహారం ప్రకాష్ రాజ్ ను ఇరకాటం లో పెట్టిందని చెప్పొచ్చు .

ప్రకాష్ రాజ్ కు నాలుగు చోట్ల ఓటు హక్కు .. అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ ఫిర్యాదు
అసలు విషయం ఏమిటంటే ప్రకాష్ రాజ్ పోటీకి అనర్హుడు అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ అభ్యర్థి జె. జగన్ కుమార్. ప్రకాష్ రాజ్ కు నాలుగు చోట్ల ఓటు హక్కు ఉన్న కారణంగా ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చెయ్యాలని ఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ప్రకాష్ రాజ్ ఓటు హక్కు విషయాన్ని ప్రస్తావిస్తూ అలా నాలుగు చోట్ల ఓటు హక్కు కలిగి వుండటం చట్టరీత్యా నేరం అని కాబట్టి ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని ఈసీ కి ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్ తాను శాంతి నగర్ లో వుంటున్నట్లు ఎన్నికల కమీషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారని అయితే ఆయనకు ఇక్కడ ఒకటి చెన్నైలో రెండు తెలంగాణలో ఒకచోట ఓటు హక్కు వుందని అలా నాలుగు చోట్ల ఓటు హక్కు ఉండి ఇక్కడ పోటీ చేయడానికి ప్రకాష్ రాజ్ అనర్హుడని జగన్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి ఆయన పోటీ చేయాలంటే మిగతా చోట్ల వున్న తన ఓటు హక్కును రద్దు చేసుకోవాలని అయితే ఆయన ఇప్పటి వరకు తన ఓటును తొలగించమని అధికారులకు ఆర్జీ పెట్టుకోలేదని వివరించారు.

ఇటీవల ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ..ఆధారాలతో అడ్డంగా బుక్ అయిన ప్రకాష్ రాజ్
బెంగుళూరు రాజకీయాల్లో చక్రం తిప్పాలని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రకాష్ రాజ్ కు మొన్నటికి మొన్న మార్చి 12వ తేదీన బెంగళూరు మహాత్మా గాంధీ సర్కిల్ దగ్గర అనుమతి లేకుండా మైక్ వినియోగిస్తూ రాజకీయ ప్రచారం చేశారని, తనకు ఓటు వేయాల్సిందిగా అందరిని విజ్ఞప్తి చేశారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు కొందరు స్థానికులు. మీడియా మరియు ఫ్రీడమ్ ఎక్స్ప్రెషన్ బ్యానర్ కింద నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ అది రాజకీయపరమైన ర్యాలీ కానప్పటికీ ఆ ర్యాలీలో అనుమతి లేకుండా కాన్వాసింగ్ నిర్వహించారని ఈసీ కేసు నమోదు చేయించింది. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్న వీడియోను తీసిన కొందరు ఆ వీడియోను ఎన్నికల అధికారులకు వాట్సాప్ ద్వారా పంపి మరీ ఇరికించారు.

ప్రకాష్ రాజ్ టార్గెట్ గా ప్రతిపక్షాలు ... ఇరకాటంలో ప్రకాష్ రాజ్
బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీపడుతున్న ఆయనపై ఆరోపణల పర్వం కొనసాగుతుంది. మొన్నటికి మొన్న ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన నేరం కింద ఆయన మీద కేసు నమోదైతే ఇక తాజాగా ఆయనపై అనర్హత వేటు వెయ్యాలని ఈసీకి ఫిర్యాదు చెయ్యటం సంచలనంగా మారింది . ఇక ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి జె. జగన్ కుమార్ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం బెంగళూరు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.జస్ట్ ఆస్కింగ్` అనే హ్యాష్ ట్యాగ్ తో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధాని మోదీని గత నాలుగేళ్లుగా కడిగిపారేస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్వతంత్ర అభ్యర్థిగా బెంగుళూరు సెంట్రల్ నుండి బరిలోకి దిగారు. ఇక ఇప్పుడు ప్రకాష్ రాజ్ ను అవకాశం దొరికితే చాలు అడ్డంగా బుక్ చెయ్యటం ప్రతిపక్షాల వంతయ్యింది. ఇక ఈ వ్యవహారంలో ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications