పంజాబ్లో బాదల్ సర్కార్ వైఫల్యానికి కారణాలివే: అందుకే గద్దె దించేశారు..
అధికారం కాంగ్రెస్ హస్తగతం అవడంతో సీఎం పీఠాన్ని ఖాళీ చేయడానికి ప్రకాశ్ సింగ్ బాదల్ సిద్దమవుతున్నారు. ఆదివారం నాడు ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారు.
చంఢీఘడ్: పంజాబ్ ఎన్నికల ఫలితాలు అధికార అకాలీదళ్ ను చావుదెబ్బ తీశాయి. వరుసగా మూడోసారి అధికారం మాట అటుంచితే.. కాంగ్రెస్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. దీంతో ఏకపక్షంగానే కాంగ్రెస్ విజయం ఖాయమైపోయింది. ఆప్ పోటీ కూడా అకాలీదళ్ ను ఓటమికి మరింత దగ్గర చేసింది.
మొత్తం మీద అధికారం కాంగ్రెస్ హస్తగతం అవడంతో సీఎం పీఠాన్ని ఖాళీ చేయడానికి ప్రకాశ్ సింగ్ బాదల్ సిద్దమవుతున్నారు. ఆదివారం నాడు ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు రేపు పంజాబ్ గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందించనున్నారు.
కాగా పంజాబ్ లో కాంగ్రెస్ 77స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అకాలీదళ్+బీజేపీ-18, ఆప్-20 స్థానాల్లో గెలిచాయి. అకాలీదళ్ చివరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీ ఫలితాలపై స్పందించిన బాదల్.. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని అన్నారు. కోర్ కమిటీ మీటింగ్ లో దీనిపై చర్చిస్తామన్నారు.
అకాలీదళ్ ను దెబ్బతీసిని డ్రగ్స్ మాఫియా:
డ్రగ్స్ రవాణాకు కేరాఫ్ గా దేశవ్యాప్తంగా పంజాబ్ అపఖ్యాతిని మూటగట్టుకుంది. ప్రకాశ్ సింగ్ బాదల్ సింగ్ సర్కార్ ఈ దిశగా గట్టి చర్యలేమి తీసుకోకపోవడంతో.. రాష్ట్రంలో చాలామంది యువత డ్రగ్స్ కు బానిసయ్యారు. పంజాబ్ నుంచే చాలా రాష్ట్రాలకు డ్రగ్స్ రవాణా జరుగుతూ వస్తోంది.
అకాలీ సర్కార్ దీనిపట్ల అలసత్వంతో వ్యవహరించడంతో ప్రజలకు ఆ పార్టీపై నమ్మకం సన్నగిల్లింది. దీంతో ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో పరాజయం తప్పలేదు.
అవినీతితో ప్రజల్లో వ్యతిరేకత:
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన అకాలీదళ్ అవినీతి విషయంలోను అపఖ్యాతినే మూటగట్టుకుంది. రాష్ట్రంలోని కీలక వ్యాపార రంగాలన్నింటిని అకాలీదళ్ నేతలే శాసిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎన్నికల వేళ ప్రతిపక్షాలు ఇవే ఆరోపణలతో అధికారపక్షాన్ని ఇరుకునపెట్టాయి.
అధికార పార్టీ నేతలు సైతం ఎంతసేపు ఆరోపణలు తప్పని వాదించారే తప్పితే.. వాటిలో వాస్తవాలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ పరిణామాలు ప్రజల్లో అకాలీదళ్ పట్ల ప్రతికూలత పెంచేలా చేశాయి.
శాంతిభద్రత విషయంలోను వైఫల్యమే:
పాక్ కు సరిహద్దుగా రాష్ట్రంగా ఉండటంతో గురుదాస్ పూర్, పఠాన్ కోట్ లోని ఎయిర్ బేస్ పై ఇటీవల ఉగ్రవాదుల దాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులను ముందుగానే పసిగట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలను ప్రత్యర్థి పార్టీలు జనంలోకి బలంగా తీసుకెళ్లారు.
పార్టీ నేతల బంధవులు, సన్నిహితులు సైతం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలు పార్టీని మరింతగా దెబ్బతీశాయి.
సిద్దూ ఎఫెక్ట్:
ఎన్నికలకు కొద్దిరోజుల ముందు సిద్దూ బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లడంతో.. ఆ పార్టీకి ఇది లాభించగా.. అకాలీదళ్-బీజేపీ కూటమికి మాత్రం ప్రతికూలంగా మారింది. అమృత్సర్ లో సిద్దూకు ఉన్న పట్టు కాంగ్రెస్ కు కలిసొచ్చింది.
అదీగాక, మాజీ సీఎం అమరీందర్ సింగ్ ఇవే తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించడం కూడా.. కాంగ్రెస్ పట్ల సానుభూతి పెరిగేలా చేశాయి. ప్రచారం కూడా బాగానే నిర్వహించడంతో యువ ఓటర్లు చాలామంది కాంగ్రెస్ వైపు ఆకర్షితులైనట్లు చెబుతున్నారు.
ఆప్ మరింతగా దెబ్బేసింది..
పంజాబ్ లో ఆప్ పోటీ అకాలీదళ్ ను ఓటమికి మరింతగా దగ్గర చేసింది. ఆప్ తో ఓట్ల చీలిక ఏర్పడటంతో పాటు.. అధికార పార్టీపై ఆప్ చేసిన విమర్శలు అకాలీదళ్ ను అధికారానికి దూరం చేశాయి. మొత్తం మీద లోక్ సభ ఎన్నికలు ఇచ్చిన బూస్టింగ్ తో బరిలో దిగిన ఆప్.. రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. అధికార అకాలీ దళ్ మూడోస్థానానికి పడిపోయింది.