2020లో మరణించిన ప్రముఖులు: భారత మాజీ రాష్ట్రపతి, ఎస్పీ బాలుతో పాటు ఎందరో మహానుభావులు
2020 వ సంవత్సరం లో భారత దేశంలో కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. అంతే కాదు ఎంతో మంది ప్రముఖులను కరోనా మహమ్మారి పొట్టనపెట్టుకుంది . భారతదేశంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గానగంధర్వుడి ఎస్పీ బాలసుబ్రమణ్యం, భారత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఇలా వీరు మాత్రమే కాకుండా ఎందరో ప్రముఖులను కరోనా మనకు దూరం చేసింది.
2020 లో మనల్ని వీడి వెళ్ళిపోయిన మహానుభావులు
కరోనా మహమ్మారి పంజా విసిరిన 2020 లో ఊహించని విధంగా భారతదేశం లోని ప్రముఖులు మృత్యువాత పడ్డారు. కొందరు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతే, మరికొందరు ఇతర అనారోగ్యాలతో మనల్ని వీడి వెళ్లిపోయారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి మధ్య మార్చి 24 న దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేయాలని కేంద్రం ఆదేశించింది. కరోనా లాక్డౌన్ సమయంలో అనేక మంది భారతీయ ప్రముఖులు కన్నుమూశారు. ఈ ఏడాది అత్యంత విషాదకరంగా విభిన్న రంగాల్లో పేరెన్నిక గన్న వారు మరణించటం విషాదం .
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే తుది శ్వాస విడిచారు. ప్రణబ్ ముఖర్జీకి మెదడులో రక్తం గడ్డకట్టడం తో దానిని తొలగించడానికి చేసిన అత్యవసర శస్త్రచికిత్స వల్ల ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. కొద్దిరోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రణబ్ముఖర్జీ ఆగస్టు 31వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 10వ తేదీన మధ్యాహ్నం తలలో రక్తం గడ్డకట్టడం తో ఆసుపత్రిలో చేర్పించగా , అప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయినప్పటికీ శస్త్రచికిత్స అత్యవసరమైన నేపథ్యంలో ఆయనకు ఆపరేషన్ చేశారు మిలటరీ ఆసుపత్రి వైద్యులు. 21 రోజుల పాటు ప్రాణాల కోసం పోరాటం సాగించిన ప్రణబ్ముఖర్జీ చివరకు ఆగస్టు 31 వ తేదీన ప్రాణాలు కోల్పోయారు.
దివికేగిన గాన గంధర్వుడు
కరోనా కారణంగా గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కనిపించని సుదూర లోకాలకు వెళ్లిపోయారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జూన్ 4, 1946 సంవత్సరంలో జన్మించగా ఆయన సెప్టెంబర్ 25, 2020 కరోనాతో ఒక నెల రోజుల పాటు పోరాడి చివరకు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో కన్నుమూశారు . ఎస్పిబిగా ప్రసిద్ది చెందిన గాన గంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం అందర్నీ వదిలిపెట్టి దివికి చేరుకున్నాడు . భారతీయ చలన చిత్ర పరిశ్రమలో దాదాపు అన్ని భాషలలోనూ బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడారు . ఆయన పాటలు నేటికీ ప్రజల నాలుకల మీద నాట్యం చేస్తూనే ఉన్నాయి.
కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ మృతి
ఇక రాజకీయ ప్రముఖుల విషయానికి వస్తే భారత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూశారు .మోడీ మంత్రివర్గంలో వినియోగదారుల వ్యవహారాలు ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొనసాగుతున్న ఆయన ఢిల్లీలోని హాస్పిటల్లో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత కోలుకొని ఇంటికి వస్తారు అనుకున్న 74 సంవత్సరాల రామ్ విలాస్ పాశ్వాన్ అక్టోబర్ 8వ తేదీన మరణించారు. ప్రధాని మోడీ తో పాటు పలువురు ఆయనకు నివాళి అర్పించారు.
మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ మరణం
సీనియర్ పార్లమెంటేరియన్, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ 2020 సంవత్సరం లోనే కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏళ్లు. జశ్వంత్ సింగ్ గుండెపోటుతో చనిపోయారని ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ ప్రకటించింది. జశ్వంత్ జూన్ 25, 2020న సెప్సిస్తో బాధపడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత మల్టీఆర్గాన్ డిస్ఫంక్షన్ సిండ్రోమ్ మరియు గతంలో తలకు అయిన తీవ్రమైన గాయం కారణంగా ఆయన కార్డియాక్ అరెస్ట్కు గురయ్యారని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. 1938 లో జన్మించిన ఆయన 2020 సెప్టెంబర్ 27వ తేదీన తుది శ్వాస విడిచారు.
కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ , గోవా మాజీ గవర్నర్ , అస్సాం మాజీ సీఎం మృతి
ఇక వీరు మాత్రమే కాకుండా రాజకీయరంగంలో ఆర్జెడి నాయకుడు రఘువంశ ప్రసాద్ సింగ్ సెప్టెంబర్ 13వ తేదీన మరణించారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు. కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్ తన 70 ఏళ్ళ వయసులో నవంబరు 25న మృతి చెందారు. గోవా మాజీ గవర్నర్ మృదుల సిన్హా 77 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. ఆమె బిజెపి నాయకురాలు గా కీలకంగా పని చేశారు, అంతే కాకుండా తన రచనలతో సాహిత్య ప్రపంచానికి ఎనలేని సేవ చేశారు. 2001 నుండి 2016 వరకు అస్సాం ముఖ్యమంత్రి గా పనిచేసిన తరుణ్ గొగోయ్ నవంబర్ 23 వ తేదీన మరణించారు . ఆయన వయసు 84 సంవత్సరాలు.