పీకే కొత్త పార్టీ-కాంగ్రెస్, బీజేపీలకు భారీ షాక్-జగన్, కేసీఆర్ ఆశలూ గల్లంతు-టార్గెట్ రెండో ఫ్రంట్
ఇన్నాళ్లూ దేశంలో పలు రాజకీయ పార్టీలకు సేవలు అందించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగుతున్నారు. బీహార్ కేంద్రంగా జన్ సురాజ్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. అయితే దీని ప్రభావం ఏయే రాజకీయ పార్టీలపై పడబోతోంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న పలు కూటములు, పార్టీల్ని పీకే లక్ష్యంగా చేసుకోబోతున్నారా ? తద్వారా ఆయన ఏం ఆశిస్తున్నారన్న చర్చలు మొదలయ్యాయి.
పీకే కొత్త పార్టీ ప్రకంపనలు
తన రాజకీయవ్యూహాలతో ఇన్నాళ్లూ రాజకీయపార్టీల్ని గెలుపుబాట పట్టించిన ప్రశాంత్ కిషోర్ ఇక ప్రత్యక్ష రాజకీయాలు చేయాలని డిసైడ్ అయిపోయారు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన పీకే.. ఇప్పుడు తానే రాజకీయ పార్టీ పెట్టి తన కోసం గెలుపు వ్యూహం రచించేందుకు సిద్దమయ్యారు.
ఇవాళ ట్విట్టర్ వేదికగా జన సురాజ్ పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు పీకే చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. పీకే ప్రకటనతో ఇప్పటికే ఆయన సలహాలు తీసుకుంటున్న, భవిష్యత్తులో తీసుకోవాలని భావిస్తున్న పార్టీలన్నీ గందరగోళంలో పడ్డాయి.
Recommended Video
కాంగ్రెస్, బీజేపీలకు షాక్
ప్రశాంత్ కిషోర్ ఇవాళ చేసిన కొత్త రాజకీయ పార్టీ ప్రకటన ముఖ్యంగా విపక్ష కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చింది. నిన్న మొన్నటివరకూ కాంగ్రెస్ పార్టీలోకి తాను వస్తానని చెప్పినా కమిటీల పేరుతో కాలయాపన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పీకే భారీ షాక్ ఇచ్చినట్లయింది. పార్టీలోకి వస్తానన్న పీకేను తక్కువ అంచనావేసిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయన సేవల్ని పరోక్షంగా కూడా తీసుకునే హక్కు కోల్పోయింది. అలాగే అధికార బీజేపీ సైతం గతంలో పీకే సేవలతో ఎంతో ప్రయోజనం పొందింది. ఇప్పుడు విపక్షంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు సలహాలిచ్చి రాష్ట్రాల్లో తమ ఓటములకు కారణమవుతున్న పీకే ఇప్పుడు జాతీయ స్దాయిలో తమకు ప్రత్యామ్నాయాన్ని స్వయంగా నడిపించే స్ధాయికి చేరుకుంటుండటం ఎన్డీయేకు షాక్ గా మారబోతోంది.
కేసీఆర్ ఆశలపై నీళ్లు?
తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న కేసీఆర్.. పీకే సేవల్ని వాడుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇప్పటికే పలుమార్లు ఆయనతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉండటంతో ఈ లోపు పీకే సలహాలతో పార్టీలో పలు మార్పులు చేసుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు టీఆర్ఎస్ ను ఆత్మరక్షణలోకి నెట్టేశాయి. ఆతర్వాత పీకే కాంగ్రెస్ లో చేరకపోవడంతో ఊపిరిపీల్చుకున్న కేసీఆర్ కు ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటన భారీ షాకిచ్చినట్లు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ స్ధానంలో ఐప్యాక్ సేవలు అయినా టీఆర్ఎస్ కు లభిస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
జగన్ వ్యూహాలపై ప్రభావం
ఇదే కోవలో ఏపీలో 2024లో జరిగే ఎన్నికల్లో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని భావిస్తున్న వైఎస్ జగన్ కు పీకే కొత్త పార్టీ ప్రకటన షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకుప్రయత్నించి వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని పీకే చేసిన సూచనపై జగన్ ఆగ్రహంగా ఉన్నారు. పీకేను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి.
ఇప్పుడు పీకే కొత్త పార్టీ ప్రకటనతో ఇక వైసీపీకి నేరుగా ఆయన సేవలు అందే అవకాశం అయితే లేదని తేలిపోయింది. దీంతో ఇప్పుడు వచ్చే ఎన్నికలకు పీకే సేవల్ని వాడుకోవాలని భావించిన జగన్ ఆశలపై కూడా నీళ్లు చల్లినట్లయింది.