'ఆనంది' విషాదం: పెళ్లి కోసం కొన్న చీరలోనే అంత్యక్రియలు
ముంబై : చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ ఆనంది ఫేమ్ ప్రత్యూష బెనర్జీ కేసు ఎప్పటికప్పుడు మలుపు తిరుగుతోంది. జాతీయ మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం - బెంగాలీ సంవత్సరాది అయిన ఏప్రిల్ 14న రాహుల్ను పెళ్లి చేసుకోవాలని ప్రత్యూష నిర్ణయించుకుంది. పెళ్లి కోసం కొత్త దుస్తులు ఆర్డరిచ్చింది.
ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రత్యూష భౌతికకాయానికి ఆ చీరకట్టి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద సంఘటన అందరినీ కలచి వేసింది. ప్రియుడు రాహుల్, ప్రత్యూష సంబంధాల్లోని కొత్త విషయాలు కూడా పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి.
ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాహుల్ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. సహ నటుడు రాహుల్ రాజ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొంత కాలంగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నాయి.
నిరుడు ఆగస్టులో సహ నటులతోపాటు ఇద్దరి కామన్ ఫ్రెండ్స్కు రాహుల్ పెద్ద పార్టీ ఇచ్చారు. తనకు కాబోయే భార్య ప్రత్యూషే నంటూ ఆ పార్టీలో రాహుల్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఆ పార్టీ బిల్లు పూర్తిగా కట్టలేదు. దీనిపై కూడా ఇద్దరి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది.

దానికితోడు, 2011లో ఓ ముంబై వ్యాపారవేత్త చాలా కాలం ప్రత్యూష డేటింగ్ చేసినట్లు చెబుతున్నారు దీనిపై ఇద్దరూ తరచూ గొడవలు పడేవారు. ఈ స్థితిలో ఏప్రిల్ 14న పెళ్లి ముహూర్తంపై రాహుల్ రాజ్ నోరు మెదపలేదని, ఇదే సమయంలో రాహుల్ మాజీ ప్రేయసి సీన్లోకి వచ్చిందని, దీంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగిందని చెబుతున్నారు.
ప్రతి రోజు ట్విట్టర్లో పోస్టులు చేయడం ప్రత్యూష బెనర్జీకి అలవాటు. అయితే 2015 నవంబర్ నుంచి తన ట్విట్టర్ ఖాతాను మూసివేసింది. రాహుల్తో గొడవవల్లే ఆమె ఇలా చేసినట్లు ప్రత్యూష స్నేహితులు తెలిపారు. ఆమె ఆర్థిక పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉన్నట్లు సమాచారం. ప్రత్యూష బ్యాంక్ ఖాతాలను వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలావుంటే, ప్రత్యూష ప్రియుడు రాహుల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్, ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడని పోలీసులు తమ విచారణలో వెల్లడైనట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications