మోడీ మానియా: ఢిల్లీలో బీజేపీకి 40 సీట్ల వరకు, సీఎంగా కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి ఏడో తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీ పోల్ సర్వేలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎక్కువ మంది దేశ రాజధాని ఢిల్లీ ఓటర్లు ఓటు వేశారు. అదే సమయంలో, మెజార్టీ మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇస్తామని చెప్పారు.
ఇండియా టుడే-సిసిరో ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ప్రీపోల్ సర్వేలో.. భారతీయ జనతా పార్టీకి 40 శాతం ఓట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి 36 శాతం ఓట్లు వస్తాయని తేలింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా కోలుకోలేని పరిస్థితిలోనే ఉంది. ఆ పార్టీకి కేవలం 16 శాతం మాత్రమే ఓటేశారు.
ఈ సర్వే ప్రకారం... బీజేపీ 34-40 సీట్లు, ఏఏపీ 25-31 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 3-5 సీట్లు గెలుచుకోనుంది. ఇతరులు రెండు సీట్లు గెలుచుకుంటారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 70 నియోజకవర్గాలలోని 210 పోలింగ్ బూత్లలో 4,459 మంది నుండి అభిప్రాయం తీసుకున్నారు.
ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బెస్ట్
ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అరవింద్ కేజ్రీవాల్కు 35 శాతం మంది ఓటేశారు. కాగా, ఇప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న హర్షవర్ధన్కు 23 శాతం మంది ఓటేశారు. షీలాదీక్షిత్కు కేవలం తొమ్మిది శాతం మంది మాత్రమే మద్దతు పలికారు.
కాగా, ఢిల్లీలోని 70 నియోజకవర్గాలలో ఫిబ్రవరి 7న ఎన్నికలు జరుగుతాయి. 10వ తేదీన ఫలితాలు ఉంటాయి. ఢిల్లీలోని డెబ్బై అసెంబ్లీ స్థానాల్లో 1.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 11,763 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 32, ఏఏపీ 27, కాంగ్రెస్ 15 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ 49 రోజులు పాలించారు. అనంతరం రాష్ట్రపతి పాలన వచ్చింది.