లవ్ జిహాద్..? భర్త అరెస్ట్,భార్యకు గర్భస్రావం? గతంలో మతాంతర వివాహం చేసుకున్నవారికీ వేధింపులు..?
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాంటీ లవ్ జిహాదీ చట్టంతో హిందూ-ముస్లిం జంటలు వేధింపులకు గురవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భజరంగ్దళ్ కార్యకర్తలు,రైట్ వింగ్ శక్తులు హిందూ-ముస్లిం దంపతులను వేధిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. లవ్ జిహాదీ ఆరోపణలతో ఇటీవల ఓ ముస్లిం వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయగా... అతని భార్యను షెల్టర్ హోమ్కు తరలించారు. అక్కడికెళ్లాక తీవ్ర రక్త స్రావం,కడుపు నొప్పితో ఆమె రెండుసార్లు ఆస్పత్రిపాలైంది. దీంతో ఆమెకు గర్భస్రావం జరిగినట్లుగా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే ప్రభుత్వ అధికారులు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు.
అసలేం జరిగింది...
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో తమ వివాహ రిజిస్ట్రేషన్ కోసం ఓ జంట ఈ నెల 5వ తేదీన స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో కొంతమంది భజరంగ్దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకుని వివరాలు ఆరా తీశారు. 'నా వయసు 22... నేను మేజర్ను... నా ఇష్టానుసారమే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. ఈ ఏడాది జులై 24న మా పెళ్లి జరిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యాంటీ లవ్ జిహాదీ చట్టం తీసుకురావడానికి 4 నెలల ముందే నేను మతం మారాను.' ఆమె భజరంగ్ దళ్ కార్యకర్తలకు వివరించింది.
భర్త అరెస్ట్.. భార్యకు గర్భస్రావం...
భజరంగ్దళ్ కార్యకర్తలు మాత్రం ఆ జంట వాదనను వినిపించుకోలేదు. ఆ ఇద్దరినీ పోలీస్ స్టేషన్కు లాక్కెళ్లారు. పోలీసులు ఆమె భర్తతో పాటు అతన్ని సోదరుడిని అరెస్ట్ చేసి ఆమెను షెల్టర్ హోమ్కు తరలించారు. అక్కడ ఆమెకు కడుపునొప్పి,తీవ్ర రక్తస్రావం కావడంతో రెండుసార్లు ఆస్పత్రిపాలైంది. దీంతో ఆమెకు గర్భస్రావం జరిగినట్లు కొన్ని కథనాలు వచ్చాయి. కానీ అధికారులు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండించారు. అందులో నిజం లేదని చెప్పారు. ఆమెకు వైద్య చికిత్స అందించిన మొరాదాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని రక్తస్రావం ఆగిపోయిందని తెలిపారు.
Recommended Video
చట్టం దుర్వినియోగం..?
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 28న యాంటీ లవ్ జిహాదీ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం వివాహం కోసం బలవంతపు మత మార్పిడి నిషిద్ధం. ఒకవేళ హిందూ,ముస్లిం జంట పెళ్లి చేసుకోవాలంటే... మతం మారేందుకు రెండు నెలల ముందు మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘించేవారికి జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదు. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చాక... గతంలో మతాంతర వివాహం చేసుకున్న జంటలే ఎక్కువ టార్గెట్ అయ్యాయన్న వాదన వినిపిస్తోంది. అలాంటి కేసుల్లో కొత్త చట్టం ద్వారా వారిపై అభియోగాలు మోపే ప్రయత్నం సరికాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.