కన్న కూతురునే ' పరువు హత్య'.. గర్భిణీ అని కూడా చూడకుండా!,
కులాంతర వివాహం చేసుకున్న ఓ అమ్మాయిని వెతికి పట్టుకొని మరీ హత్య చేశారు.
చెన్నై: దేశంలో పరువు హత్యలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కడుపున పుట్టినవారన్న సంగతి కూడా చూడకుండా.. తల్లిదండ్రులే పిల్లలను హత్య చేస్తున్న ఘటనలు మరింత కలవరం రేపుతున్నాయి. దీంతో కులాంతర వివాహాలు చేసుకునేవారికి సమాజంలో రక్షణ కరువైపోతున్న పరిస్థితి ఏర్పడింది.
తాజాగా చెన్నైలోని అరియలూరు జిల్లా సెందురైలోను ఇలాంటి ఘటనే సోమవారం నాడు చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న ఓ అమ్మాయిని వెతికి పట్టుకొని మరీ హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సెందురై సమీపంలోని పొన్ పరప్పి గ్రామానికి చెందిన తంగరాజ్, భవానీల కుమార్తె షర్మిల, సమీప గ్రామానికి చెందిన కలై రాజన్ ను ప్రేమించింది.

ఈ నేపథ్యంలో వీరిద్దరు 2008లో ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. అయితే షర్మిల కుటుంబీకులు ఆమెను వెతికి పట్టుకొచ్చి మరీ.. సమీప బంధువైన అన్భుమణితో బలవంతపు వివాహం చేశారు. అయిష్టంగానే కాపురం చేసిన షర్మిలకు ఓ ఆడపిల్ల జన్మించింది. బలవంతపు కాపురం ఇక తన వల్ల కాదంటూ 2013లో మరోసారి ఇంట్లోంచి పారిపోయింది.
ప్రియుడు కలైరాజన్ తో కలిసి ఓ ఊరిలో సహజీవనం చేస్తోంది. అక్కడే చిన్న ఉద్యోగం చేసుకుంటూ వీరిద్దరు నివసిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల మరోసారి గర్భం దాల్చింది. అయితే షర్మిల కోసం మరోసారి వేట ప్రారంభించిన ఆమె కుటుంబ సభ్యులు.. ఆమె ఆచూకీ కనుగొన్నారు. మాయ మాటలతో నమ్మబలికి ఇంటికి తీసుకొచ్చారు.
ఊరి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి కలైరాజన్ ను అల్లుడిగా స్వీకరించేందుకు అంగీకరించారు. అనంతరం షర్మిలను ఇంటికి తీసుకుని వెళ్లారు. ఇది జరిగిన రోజు రాత్రే షర్మిల విగత జీవిగా కనిపించింది. పైగా దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగుచూసింది. షర్మిలను ఇంటికి తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. గర్భం తొలగించుకోవాల్సిందిగా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. షర్మిల ససేమిరా అనడంతో.. ఆమెను తీవ్రంగా కొట్టి హతమార్చారు. ఆపై ఆత్మహత్యగా చిత్రకిరీంచారు.












Click it and Unblock the Notifications