ఇక ప్రీపెయిడ్ మీటర్లు..! బ్యాలన్స్ ఉంటేనే వెలుగు..! లేకపోతే చీకటే..!!
ఢిల్లీ / హైదరాబాద్ : విద్యుత్ రంగంలో వినూత్న మార్పులు తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇంతకాలం కరెంటును వినియోగించుకున్న తరవాత అందుకు సంబందించి బిల్లును చెల్లించే పద్దతి ఉండేది. ఇప్పుడు అలాంటి పద్దతికి తిలోదకాలు ఇవ్వనుంది విద్యుత్ సంస్థ. ముందస్తుగా ప్రీపెయిడ్ బ్యాలన్స్ చేయించుకుంటేనే అందుకు తగ్గ విద్యుత్ ను ఇళ్లకు సురఫరా చేస్తారన్ని మాట. దీంతో బ్యాలన్స్ లేక పోతే ఫోన్ మూగబోయినట్టు ముందస్తుగా ప్రీపెయిడ్ చెల్లించకపోతే మీ ఇల్లి చిమ్మ చీకటిగా మారుతుందన్న మాట..!!
తొలిదశలో 500 యూనిట్లు దాటిన వారికి కేటాయింపు..! వినూత్న ప్రయోగం అంటున్న అదికారులు..!!
సెల్ఫోన్ ప్రీపెయిడ్ నంబరు తీసుకుని ఎప్పటికప్పుడు రీఛార్జి చేయిస్తున్నారు కదా.. అలాగే మీ ఇంట్లో వాడుకునే కరెంటుకు ముందే డబ్బు కట్టి (ప్రీ పెయిడ్) మీటర్ రీఛార్జి చేయించుకుంటేనే కరెంటు సరఫరా అవుతుంది. లేదంటే సరఫరా నిలిచిపోయి అంధకారంలో ఉండాల్సిందే. ఈ పరిస్థితి దేశమంతటా 2022 చివరికల్లా తీసుకురావాలని కేంద్రం తాజాగా గడువు నిర్ణయించింది. ఈ అంశంపై దేశంలోని అన్ని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఉన్నతాధికారులతో తాజాగా దిల్లీలో కేంద్ర విద్యుత్శాఖ సమావేశం ఏర్పాటుచేసి చేపట్టాల్సిన పనులపై చర్చించింది. తెలంగాణ దక్షిణ డిస్కం అధికారులు దీనికి హాజరై రాష్ట్రం తరఫున సూచనలిచ్చారు. ఈ పథకాన్ని దశల వారీగా అమలు చేయాలని ప్రాథమికంగా రాష్ట్రాలు అంగీకరించాయి.
రాష్ట్రమంతటా అన్ని ఇళ్లు, పరిశ్రమలకూ తప్పదు ..! విడతల వారీగా అమలు..!!
ప్రతి కరెంటు కనెక్షన్కు ప్రస్తుతం సాధారణ మీటర్లు ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగి మీటరు రీడింగ్ తీసుకుని బిల్లు ఇస్తున్నారు. కానీ పలు రాష్ట్రాల్లో బిల్లుల వసూలు 100 శాతం జరగడం లేదు. ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటు వల్ల డిస్కం పరిస్థితి మెరుగవుతుందని అంచనా. ఒకేసారి దేశమంతా ప్రీ పెయిడ్ మీటర్ల ఏర్పాటు అసాధ్యమని తేలింది. ప్రస్తుతం సాధారణ మీటర్ల ధర సింగిల్ ఫేజ్ దైతే 750 త్రీఫేజ్ది 1500 దాకా అవుతోంది. వాటిని తొలగించి ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలంటే సింగిల్ ఫేజ్కు 3 వేలు, త్రీఫేజ్కు 6 వేలు చెల్లించాలి. మొత్తంగా కోటి మీటర్లు కొంటామంటే తక్కువ ధరకు తయారుచేయడానికి కంపెనీలు అంగీకరిస్తాయని డిస్కంలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ తెలంగాణలో పరిస్థితి..! ఆర్థిక భారాన్ని కేంద్రం భరించాలంటున్న అదికారులు..!!
తెలంగాణలో మొత్తం 1.17 కోట్లకు పైగా కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలంటే కనీసం 4 వేల కోట్ల వరకూ వ్యయమవుతుందని అంచనా. ఇంత సొమ్మును సొంతంగా భరించే శక్తి తమకు లేదని.. కేంద్రం 60 శాతానికి తగ్గకుండా భరించాలని డిస్కంలు కోరాయి. వచ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి వీటి ఏర్పాటును దశల వారీగా ప్రారంభించాలని యోచిస్తున్నారు. తెలంగాణలో తొలుత నెలకు 500 యూనిట్లకు పైగా కరెంటు వాడే వినియోగదారుల కనెక్షన్లకు వీటి ఏర్పాటును ప్రారంభించాలని తాజాగా ప్రతిపాదించారు. మలిదశలో 200 యూనిట్లకు మించి వాడే కనెక్షన్లకు పెట్టాలని యోచిస్తున్నారు.
ముందస్తుగా చెల్లిస్తే రాయితీ ఇస్తాం..! తెలంగాణ అదికారుల వెల్లడి..!!
ప్రీపెయిడ్ మీటర్లను ప్రతి వినియోగదారుడి కనెక్షన్కూ ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణలో ఈ మీటర్లు ఏర్పాటు చేసి ముందే డబ్బు చెల్లించేవారికి కరెంటు ఛార్జీల్లో 5 నుంచి 10 శాతం వరకూ రాయితీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని, ఇది ఖరారైన తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీ పెయిడ్ మీటర్ల ద్వారా కరెంటు సరఫరా ప్రారంభమవుతుందని ఉన్నతాదికారులు తెలియజేస్తున్నారు. వీటిని ఏర్పాటు చేసుకుంటే వినియోగదారులకు ఎంత కరెంటు వాడుకోవాలనే దానిపై ముందే అవగాహన ఏర్పడి పొదుపు చేస్తారని అదికారులు అంచనా వేస్తున్నారు.