NEET 2021: రేపే నీట్ ఎగ్జామ్ - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ : అభ్యర్ధులకు కీలక సూచనలు..!!
సుప్రీం కోర్టు ఆదేశాలతో నీట్ పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది. ఈ నెల 12వ తేదీన దేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ ఎగ్జామ్కు దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ, ఏపీ నుంచి లక్ష మంది ఉన్నారు. దేశ వ్యాప్తంగా 202 పట్టణాల్లో 3,842 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, తెలంగాణలోని 7 పట్టణాల్లో 112 కేంద్రాల్లో, ఏపీలో 9 పట్టణాల్లో 151 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు చేశారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. పెన్ను, పేపర్ విధానంలోనే పరీక్షను నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రంలోని అడ్మిట్ కార్డు, ఫోటో, గుర్తింపు కార్డుతో పాటు చిన్న శానిటైజర్ బాటిల్కు మాత్రమే అనుమతిస్తారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలి. షూ, ఫుల్ హ్యాండ్ షర్ట్స్, పెన్నులు, ఆభరణాలు, వాటర్ బాటిల్స్కు అనుమతి లేదని ఎన్టీఏ అధికారులు స్పష్టం చేశారు.
గత వారం నీట్ పరీక్ష వాయిదా వేయాలనే పిటీషన్ పైన సుప్రీంలో విచారణ జరిగింది. ఆ సమయంలోనే నీట్ పరీక్ష వాయిదాకు సుప్రీం కోర్టు నో అని చెప్పేసింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారమే ఈ పరీక్షను జరపాలని అధికారులను ఆదేశించింది. నీట్ పరీక్ష రోజునే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉన్నాయని, అలాగే CBSE కంపార్ట్మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని, అందువల్ల మరో తేదీకి వాయిదా వేయాలని కొందరు పిటిషన్లు దాఖలు చేయగా, ఈ పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది.
షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12, ఆదివారమే జరుగుతుందని సుప్రీం స్పష్టం చేయటంతో..నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక, ఈ ఆదేశాలు వచ్చిన తరువాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. విద్యార్ధుల ఒత్తిడిని పట్టించుకోకుండా ప్రభుత్వం గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. నీట్ ను వాయిదా వేయాలని..వారిని న్యాయపరంగా సహకారం అందించాలని రాహుల్ డిమాండ్ చేసారు. అయితే, ప్రభుత్వం అప్పటికే సుప్రీం ఆదేశాలు రావటంతో..దీని పైన రియాక్ట్ కాలేదు.
Recommended Video
ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసారు. రెండు ప్రభుత్వాలు ఈ పరీక్ష కోసం ప్రత్యేకంగా బస్ సౌకర్యం తో పాటుగా..కరోనా ఆందోళన ఉండటంతో కోవిడ్ ప్రోటోకాల్ ను అమలు చేస్తూ పరీక్షలకు మార్గ దర్శకాలు జారీ చేసారు.