ఇందిర ధైర్యం: రాజీవ్ గాంధీని తప్పుబట్టిన ప్రణబ్
న్యూఢిల్లీ: అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న ఉగ్రవాదులను తరిమికొట్టేందుకు సైనిక చర్య మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఇందిరా గాంధీ అర్థం చేసుకున్నారని, దానివల్ల తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా దేశ ప్రయోజనాల కోసం సైనిక చర్యకు ఆమె నిర్ణయించారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు.
ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ గురువారం ఢిల్లీలో ఆవిష్కరించిన ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం 'కల్లోల సంవత్సరాలు: 1980-96' రెండో భాగంలో ఈ వివరాలు ఉన్నాయి. అయోధ్య వివాదం మొదలుకొని తాను ప్రధాని కావాలని అనుకున్నట్లు వచ్చిన దుష్ప్రచారం దాకా ఎన్నో అంశాలపై తన మనసులోని మాటను ప్రణబ్ తన తాజా పుస్తకంలో తెలియజేశారు.
అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి స్థలాన్ని 1986 ఫిబ్రవరి 1న పూజా కార్యక్రమాల కోసం తెరవడం అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ తీసుకున్న తప్పుడు నిర్ణయమని, బాబ్రీ మసీదు కూల్చివేత నమ్మక ద్రోహమని, ప్రపంచం దృష్టిలో భారత ప్రతిష్ఠను దిగజార్చిందని ప్రణబ్ ఆ ఆత్మకథలో పేర్కొన్నారు.
1986 ఫిబ్రవరి 1న రామజన్మభూమి స్థలాన్ని భక్తుల దర్శనకోసం తెరవడం మరో తప్పుడు నిర్ణయమని, ఇలాంటి చర్యలను తీసుకోకుండా ఉండి ఉంటే బాగుండేదని జనం భావించారని, అలాగే బామ్రీ మసీదు కట్టడం కూల్చివేత పూర్తిగా నమ్మక ద్రోహమన్నారు.
స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకోసం చేసిన పని అని, ఇది దేశంలో, విదేశాల్లోని ముస్లింల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమే కాకుండా భిన్న సంస్కృతులకు నిలయంగా, అందరినీ అంగీకరించే దేశంగా భారత్కున్న పేరుప్రతిష్ఠలను అది దెబ్బతీసిందన్నారు.
మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం సమాజంలో సామాజిక అన్యాయం తగ్గడానికి తోడ్పడిందని, అయితే అది సమాజంలో వివిధ కులాల వారు చీలిపోవడానికి సైతం అది కారణమైందని ఆయన అభిప్రాయ పడ్డారు. 1989-91 మధ్య కాలంలో హింస, భారతీయ సమాజంలో తీవ్రమైన విభేదాలకు కారణమైందన్నారు.
జమ్ము కాశ్మీర్లో తీవ్రవాదం, సీమాంత ఉగ్రవాదం తిరిగి తలెత్తాయని, రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం దేశాన్ని కుదిపేసిందని, చివరికి 1991 మే 21న మానవ బాంబు కారణంగా రాజీవ్ గాంధీ జీవితం అర్ధంతరంగా ముగియడానికి దారి తీసిందన్నారు.
ఇందిరాగాంధీ హత్య అనంతరం తాను తాత్కాలిక ప్రధాని కావాలని ఎప్పుడూ కోరుకోలేదని, దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాలన్నీ శుద్ధ తప్పని అన్నారు. నేను తాత్కాలిక ప్రధాని కావాలని అనుకున్నానని, దాని కోసం ప్రయత్నాలు చేశానని, అయితే అందరూ కలిసి వేరే విధంగా ఒప్పించారని అప్పట్లో బోలెడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయన్నారు.
ఇవి రాజీవ్ గాంధీ మనసులో అపార్థాలను సృష్టించాయని, అయితే ఇవి పూర్తిగా తప్పుడు కథనాలు అన్నారు. అలాగే ఇందిరాగాంధీ మరణానంతరం ప్రధాని పదవికి సంబంధించి ఒక బాత్రూమ్లో తాను రాజీవ్ గాంధీతో జరిపిన సంభాషణ గురించి కూడా ప్రణబ్ ఆ పుస్తకంలో వివరంగా పేర్కొన్నారు.
అలాగే తనను రాజీవ్ గాంధీ కేంద్ర మంత్రిపదవినుంచి, ఆ తర్వాత పార్టీ నుంచి తప్పించడానికి దారి తీసిన పరిస్థితులను సైతం ఆయన పుస్తకంలో వివరిస్తూ, ఈ విషయంలో రాజీవ్, తాను ఇద్దరూ కూడా తప్పు చేశామని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రపతి విధింపు నిబంధన దుర్వినియోగానికి కారణమయ్యే అవకాశముందని ప్రణబ్ అన్నారు. అయితే ఇన్నేళ్లసమయంలో నిబంధనల్లో వచ్చిన మార్పుల కారణంగా ఆ అవకాశం చాలావరకు తగ్గిపోయిందని పుస్తకంలో పేర్కొన్నారు.
షాబానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు మీద రాజీవ్ గాంధీ తీసుకున్న చర్యలపై, ఆ నేపథ్యంలో వచ్చిన ముస్లిం మహిళల (విడాకుల అంశంలో హక్కుల రక్షణ) బిల్లుపై తీవ్రమైన విమర్శలు చెలరేగాయని, ఆధునిక భావాలున్న వ్యక్తిగా రాజీవ్ గాంధీకి ఉన్న పేరు ఈ ఘటనతో తొలగిపోయిందన్నారు.
ఈ పుస్తకంలో వివిధఅంశాలపై ప్రణబ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. నేను తెగువ చూపలేనని ఈ పుస్తకం చూస్తే తెలిసిపోతుందని, ఎందుకంటే 1960లో కాంగ్రెస్ తిరుగుబాటుదారుడు అజయ్ ముఖర్జీ, ప్రస్తుత మమతా బెనర్జీ, అప్పటి ఇందిరాగాంధీ లాంటి భారీ ప్రజాధరణ వ్యక్తిని కాదని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. అత్యంత గోప్యమైన అంశాలను వెల్లడించలేదని, పాఠకులే పుస్తకాన్ని చదివి ఓ నిర్ణయానికి రావలసి ఉంటుందన్నారు.