బ్రిటన్ రాణి అంత్యక్రియలకు రాష్ట్రపతి ముర్ము-భారత్ తరఫున అధికారిక నివాళి
భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. బ్రిటన్ రాణి మృతికి ఇప్పటికే సంతాపం తెలిపిన ముర్ము.. స్వయంగా లండన్ వెళ్లి ఆమె భౌతిక కాయాన్ని సందర్శించనున్నారు. అనంతరం అంత్యక్రియల్లో కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే లండన్ చేరుకున్న రాణి భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
ఈ నెల 17 నుంచి 19 వరకూ లండన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించబోతున్నారు. ఇందులో 17న లండన్ చేరుకుని అనంతరం లండన్ లో ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పించడంతో పాటు 19న జరిగే అంత్యక్రియల్లో కూడా పాల్గొనబోతున్నారు. తద్వారా భారత్ కు మిత్రదేశమైన బ్రిటన్ రాణికి దేశం తరఫున అధికారికంగా నివాళి అర్పించబోతున్నారు.

యూకే మాజీ దేశాధినేత, కామన్వెల్త్ దేశాల అధినేత్రి అయిన క్వీన్ ఎలిజబెత్ II సెప్టెంబర్ 8న కన్నుమూశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆమె మృతి పట్ల ఇప్పటికే సంతాపం వ్యక్తం చేశారు. భారత సంతాపాన్ని తెలియజేయడానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్ను సందర్శించారు. భారతదేశం కూడా సెప్టెంబర్ 11 ఆదివారం నాడు జాతీయ సంతాప దినాన్ని పాటించింది.












Click it and Unblock the Notifications