రాష్ట్రపతి అనూహ్యం: రాజ్యసభకు స్వపన్ దాస్గుప్తా రీ-నామినేట్ -రామ్ జెఠ్మలానీ కొడుక్కి కూడా ఎంపీ సీటు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నెల రోజుల తర్వాత సంబంధిత సంచలనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితాల తర్వాత ఎదురుపడిన తొలిసారే ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర స్థాయి ఈగోలను ప్రదర్శించడం రచ్చకు దారితీయగా, బెంగాల్ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ కీలక నేత స్వపన్ దాస్గుప్తాను తిరిగి రాజ్యసభకు రీనామినేట్ చేస్తూ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
మాజీ జర్నలిస్టు, ఒకప్పటి టీఎంసీ నేత, తర్వాతి కాలంలో బీజేపీ గూటికి చేరిన స్వపన్ దాస్గుప్తా కేవలం బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి చేతి నామినేట్ అయిన సభ్యుడు ఇతర పదవులకు పోటీ పడరాదనే నిబంధన ఉండటంతో స్వపన్ రాజ్యసభకు రాజీనామా చేసేసి బెంగాల్ లోని తారకేశ్వర్ నుంచి పోటీకి దిగారు. అయితే టీఎంసీ అభ్యర్థి చేతిలో 7వేల ఓట్లతో ఓడిపోయిన ఆయనను కేంద్రం తిరిగి రాజ్యభకు తీసుకోవాలనుకోగా, రాష్ట్రపతి ఆమేరకు నామినేట్ చేశారు.

స్వపన్ దాస్ గుప్తాతోపాటు ప్రముఖ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీని కూడా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఈ రెండు నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మంగళవారం వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసింది. మహేశ్ జెఠ్మలా దివంగత దిగ్గజ లాయర్ రామ్ జెఠ్మలానీ కొడుకు కావడం గమనార్హం.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 లోని క్లాజ్ (1) లోని ఉప-క్లాజ్ (ఎ) ద్వారా దక్కిన అధికారాలకు అనుగుణంగా రాష్టపతి రాంనాథ్ కోవింద్.. స్వపన్ దాస్ గుప్తాను రాజ్యసభకు రీ-నామినేట్ చేశారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. స్వపన్ తోపాటు బాబుల్ సుప్రియో తన కేంద్ర మంత్రి పదవిని వదులుకుని బెంగాల్ ఎన్నికల్లో పోటీచేసి దెబ్బతిన్నారు. మరో బీజేపీ లోక్ సభ ఎంపీకి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు ఎంపీలను బీజేపీ హైకమాండ్ రాజీనామా చేయించింది.












Click it and Unblock the Notifications