దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది: రాష్ట్రపతి, ప్రసంగంలో ఏం చెప్పారంటే
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. దేశ ప్రజలకు ఆయన స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు అర్పించారన్నారు. దేశ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా శ్రమించాలన్నారు.
దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. పేదరికం నిర్మూలన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలన్నారు. ఎందరో త్యాగధనుల ఆశయ ఫలమే మన స్వాతంత్ర్యం అన్నారు.
72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా రేడియో ద్వారా ఆయన తన సందేశం వినిపించారు. రాష్ట్రపతికి ఇది రెండో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం. మనం పేదరికం నుంచి స్వాతంత్ర్యం సాధించాలన్నారు. రైతులు, పోలీసులు, సైనికులు, ప్రజలు తమ తమ రంగాల్లో విశేష కృషి చేస్తున్నారని కితాబిచ్చారు.
ఆగస్ట్ 15 ప్రతి భారతీయుడికి అత్యంత పవిత్రమైనదన్నారు. త్రివర్ణ పతాకం మన దేశానికి ప్రతినిధి అన్నారు. మన పూర్వీకులు, స్వాతంత్ర్య సమరయోధులు ఎన్నో త్యాగాలు చేశారని, దాని ఫలితమే ఈ స్వాతంత్ర్యం అన్నారు. మహిళలకు నచ్చిన మార్గాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, అవకాశముండాలన్నారు. మహిళలు ప్రతిభాపాటవాలతో కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, ఉద్యోగా చేయాలనుకున్నా విద్యారంగంలో సరైన అవకాశాలు అందుబాటులో ఉండాలన్నారు.
వరుసలో ఉన్నప్పుడు తమ ముందు ఉన్నవారి హక్కులను గౌరవించి, తమ వంతు వచ్చే వరకు వేచి చూడాలన్నారు. ఆ విధంగా వేచి చూడగలిగేవారే స్వాతంత్ర్య సమరయోధులు కలలు గన్న భారతదేశాన్ని సృష్టించగలరన్నారు. ఇలా చేయడం కష్టం కాదని, చిన్న ప్రయత్నమన్నారు. దీనిని మన జీవితాల్లో భాగం చేసుకోవాలన్నారు.
ఆర్మీకి మెరుగైన ఆయుధాలను అందించాలని, మన దేశంలోనే రక్షణ పరికరాలను అభివృద్ధి చేసుకోవాలని, ఆర్మీ సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, అప్పుడే స్వాతంత్ర్య సమర యోధులు కలలు కన్న భారతదేశం నిజమవుతుందన్నారు.
తక్షణ భవిష్యత్తు కోసమైనా, మధ్యకాలిక ప్రయోజనాల కోసమైనా సరే మన దేశం నేడు తీసుకునే నిర్ణయాలు, వేసే పునాదులు, చేపట్టే ప్రాజెక్టులు, సాంఘిక, ఆర్థిక రంగాల్లో పెట్టే పెట్టుబడులు మన స్థానాన్ని నిర్ణయిస్తారని చెప్పారు. భారతీయత కేవలం మన కోసం మాత్రమే కాదన్నారు. మన దేశం, మన నాగరికత ప్రపంచ వేదికపై నిలవడానికి భారతీయత ఓ భాగమన్నారు.
మన దేశం భారతీయులది అన్నారు. మన దేశం కేవలం ప్రభుత్వానికి సంబంధించినది కాదని చెప్పారు. అందరం కలిసి మన దేశంలోని ప్రతి పౌరుడికి సహాయపడాలన్నారు. భావితరాల కోసం అటవీ సంపదను, సహజవారసత్వాన్ని, విలువైన కట్టడాలని కాపాడాలన్నారు.