టిప్పు సుల్తాన్ గొప్ప వ్యక్తి , రాకెట్ టెక్నాలజీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, బీజేపీ నాయకులకు షాక్
కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి వివాదం తారాస్థాయికి చేరిన సందర్బంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన ప్రసంగంలో టిప్పు సుల్తాన్ ప్రస్తావన తీసుకురోవడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.
బెంగళూరు: కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి వివాదం తారాస్థాయికి చేరిన సందర్బంలో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన ప్రసంగంలో టిప్పు సుల్తాన్ ప్రస్తావన తీసుకురోవడంతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు. టిప్పు సుల్తాన్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అంటూ రామ్ నాథ్ కోవింద్ అన్నారు.
విధాన సభ వజ్రోత్సవాల సందర్బంగా బుధవారం బెంగళూరులోని విధాన సౌధలో జంట సభలను (శాసన సభ, శాసన మండలి) ఉద్దేశిస్తూ రామ్ నాథ్ కోవింద్ మాట్లాడారు. టిప్పు సుల్తాన్ గొప్ప స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటీష్ సైనికులపై ధైర్యంగా తిరుబాటు చేశారని రామ్ నాథ్ కోవింద్ చెప్పారు.
టిప్పు సుల్తాన్ రాకెట్ టెక్నాలజీ
మైసూరు కేంద్రంగా టిప్పు సుల్తాన్ మొదటి సారి రాకెట్ టెక్నాలజీ ఉపయోగించారని, తరువాత ఆ టెక్నాలజీని యూరప్ దేశాలు అనుసరించాయని రామ్ నాథ్ కోవింద్ చెప్పారు. కర్ణాటకకు చెందిన కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి అబ్బక్క స్వాతంత్రం కోసం పోరాటం చేశారని చెబుతున్న సమయంలోనే రామ్ నాథ్ కోవింద్ టిప్పు సుల్తాన్ పేరు ప్రస్తావించారు.
బీజేపీ నాయకులకు షాక్
మాజీ ప్రధాని దేవేగౌడ తనకు చాల సన్నిహితుడని, ఆయన దేశానికి సేవ చేశారని రామ్ నాథ్ కోవింద్ ఇదే సందర్బంలో గుర్తు చేశారు. రామ్ నాథ్ కోవింద్ టిప్పు సుల్తాన్ పేరు ప్రస్తావించిన సందర్బంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు జోరుగా చప్పట్లు కొట్టారు. బీజేపీ నాయకులు మాత్రం మౌనంగా ఉండిపోయారు.
భారత్ కు కర్ణాటక ఇంజన్
భారతదేశానికి టెక్నాలజీ పరంగా, ఆర్థికపరంగా ముందంజలో ఉందని రామ్ నాథ్ కోవింద్ అన్నారు. భారతదేశానికి ఈ రెండు రంగాల్లో కర్ణాటక ఇంజన్ లా పని చేస్తుందని రామ్ నాథ్ కోవింద్ చెప్పారు. సర్ ఎం. విశ్వేశ్వరయ్య లాంటి మహానుభావులు ఇక్కడే శక్తి వంచన లేకుండా కృషి చేశారని అన్నారు.
1956లో రాజేంద్ర ప్రసాద్
1956లో అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ విదాన సౌధను ప్రారంభించారని రామ్ నాథ్ కోవింద్ ఇదే సందర్బంలో గుర్తు చేశారు. విధాన సౌద కర్ణాటకకే ఒక ప్రత్యేక ఆకర్షణ, సర్ ఎం. విశ్వేశ్వరయ్య ఎంతో ముందు చూపుతో విధాన సౌధను నిర్మించారని ఇదే సందర్బంలో గుర్తు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ బిగ్ ఫైట్
బుధవారం విదాన సౌధలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ వాజుబాయ్ వాలా, ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేంద్ర మంత్రులు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టిప్పు సుల్తాన్ జయంతిని కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహించకూడదని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యలతో బీజేపీ నాయకులు షాక్ కు గురైనారు.