కర్నాటకంలో అనూహ్య ఘట్టం: రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు?
బెంగళూరు: కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభం గురువారం అనూహ్యమైన మలుపును తీసుకోబోతోందా? రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారంపై స్పీకర్ నిర్ణయం తీసుకునేంత వరకూ ప్రజా ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు లేవా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. భారతీయ జనతాపార్టీకి చెందిన ఒకరిద్దరు నాయకులు ఈ విషయాన్ని కొట్టి పారేయట్లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు- రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. స్పీకర్ రమేష్ కుమార్ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను ఇంకా నాన్చుతూనే వస్తున్నారు. వారి రాజీనామాలపై ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేదు. ఫలితంగా- స్పీకర్ తుది నిర్ణయాన్ని తీసుకునేంత వరకూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
లాంఛనప్రాయమే అనుకున్నా..
కర్ణాటకలో ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి సారథ్యంలో 14 నెలల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణం ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలే. కాంగ్రెస్కు చెందిన 12 మంది, జేడీఎస్కు చెందిన ముగ్గురు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంతో సంకీర్ణ కూటమి మైనారిటీలో పడిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని నిరూపించుకోలేక ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి కుమారస్వామి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని గవర్నర్ వజూభాయ్ వాలాకు సమర్పించారు. అప్పటికప్పుడు దీన్ని ఆమోదించారు గవర్నర్. ఈ క్రమంలో- 105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా ఉన్న భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనప్రాయమేనని అనుకున్నారంతా. చివరి నిమిషంలో వ్యవహారం మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది.
కర్ణాటకలో యూపీ ఫార్ములా? ముఖ్యమంత్రిగా కొత్త ముఖం? కేంద్ర కేబినెట్లో యడ్యూరప్ప?
స్పీకర్ రాజీనామాలను ఆమోదిస్తే..
స్పీకర్ కేఆర్ రమేష్కుమార్ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే.. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి ఢోకా ఉండదు. నిరభ్యంతరంగా అధికార పీఠాన్ని అధిష్టించవచ్చు. తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామలను ఆమోదించిన తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సభ్యుల సంఖ్యాబలం 103కు పడిపోతుంది. ఇప్పటికే- బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉంది. బీజేపీకి మద్దతు ఇవ్వడానికి మరో ఇద్దరు స్వతంత్రులు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో- ఉప ఎన్నికలు నిర్వహించేంత వరకూ బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏదీ ఉండదు.
స్పీకర్ రాజీనామాలను ఆమోదించకపోతే..
స్పీకర్ రాజీనామాలను ఆమోదించకపోతేనే రాజ్యంగపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. రాజీనామాలను ఆమోదించని పక్షంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సభ్యుల సంఖ్య 112 అవుతుంది. ప్రస్తుతం బీజేపీకి అంతమంది సభ్యులు లేరు. అంత బలమూ లేదు. అలాగని కాంగ్రెస్కు గానీ, జనతాదళ్ (ఎస్)కు గానీ అంతమంది సభ్యులు లేరు. ఈ నేపథ్యంలో- బలపరీక్షకు ముందు నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయి. 112 మంది సభ్యులు అవసరం ఉన్న చోట- 105 మంది బలం ఉన్న పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. న్యాయపరమైన, రాజ్యాంగపరమైన చిక్కులు ఎదురవుతాయి. వాటన్నింటినీ కాదని అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం గవర్నర్ కల్పించినప్పటికీ.. న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే అసలుకే ఎసరు పడుతుంది. ఈ నేపథ్యంలో- తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించేంత వరకూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో- గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే అవకావం ఉంది.