తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి జాగ్రత్తగా..: నారీమన్
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన బిల్లు తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి రాజ్యాంగ నిపుణులు పాలి నారిమన్ సూచించారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ తిరస్కరించిన బిల్లును రాష్ట్రపతి న్యాయసమీక్షకు పంపడం మంచిదని అభిప్రాయపడ్డారు.
శాసనసభ అధికారాలపై సుప్రీం కోర్టులో స్పష్టత తీసుకున్న తర్వాతే ముందుకెళ్లడం మంచిదని, ఎస్.ఆర్.బొమ్మై కేసులో శాసనసభకే అధికారాలని సుప్రీం తీర్పు చెప్పిందని ఆయన అన్నారు. ఫెడరల్ వ్యవస్థ వ్యవహారం కాబట్టి తెలంగాణ బిల్లుపై జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆయన అన్నారు.
ఎస్ఆర్ బొమ్మై కోసుతో పాటు బాబూలాల్ పరాటే కేసు కూడా మన ముందు ఉందని, ఇందులో దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారనేది చూడాలని ఆయన అన్నారు. తెలంగాణ బిల్లు విషయంలో రాష్ట్రపతి వద్ద రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
సుప్రీంకోర్టు సలహా తీసుకోవడం ఒక ప్రత్యామ్నాయం కాగా, నేరుగా మంత్రి వర్గానికి బిల్లును పంపించడం రెండో ప్రత్యామ్నాయమని ఆయన అన్నారు. ఇప్పుడు గానీ తర్వాత గానీ తెలగాణ బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని ఆయన అన్నారు.