వారికి మళ్లీ ఊరట: ఆ ఎల్పీజీ సిలిండర్ల ధర తగ్గింపు
న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ రేటు తగ్గింది. ఒక్కో కనెక్షన్పై 36 రూపాయల మేర తగ్గించాయి చమురు కంపెనీలు. ఈ తెల్లవారు జాము నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల బరువు ఉండే వంటగ్యాస్ సిలిండర్లపై కేంద్ర ప్రభుత్వం ఇదివరకు వరుసగా పలుమార్లు రేట్లను పెంచింది కేంద్ర ప్రభుత్వం. గత ఏడాది నవంబర్, డిసెంబర్లో ఈ కేటగిరీకి చెందిన వంటగ్యాస్ సిలిండర్లపై మోపిన భారం రూ. 369.50 పైసలు.
నవంబర్లో 266 రూపాయలు, డిసెంబర్లో రూ.103.50 పైసలను పెంచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటాయి. 2,000 రూపాయలను దాటేశాయి. ఈ ఏడాది కూడా రెండుసార్లు వాటిపై భారాన్ని మోపింది. మార్చి 1వ తేదీన 105 రూపాయలు, ఏప్రిల్ 1వ తేదీన ఏకంగా 250 రూపాయలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. మే 1వ తేదీన కూడా 100 రూపాయల భారాన్ని అధికంగా మోపింది.
ఫలితంగా- పలు నగరాల్లో వాణిజ్య సిలిండర్ల ధర 2,400 రూపాయలను దాటేసింది. ఈ పెంపు పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. హోటళ్ల మనుగడ తలకిందులైంది. కమర్షియల్ వంటగ్యాస్ను వినియోగించే చిరు వ్యాపారులు ఇప్పటికే అనేక ఇక్కట్ల బారిన పడ్డారు. దీనికితోడు హోటళ్లల్లో వినియోగించే సిలిండర్ల ధర పెరగడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత దెబ్బతిన్నాయి. వారికి ఊరట కలిగించేలా.. ఇదివరకు కమర్షియల్ ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను తగ్గించింది కేంద్రం.

ఇదివరకు 135 రూపాయలను తగ్గించింది. ఇప్పుడు వాటి రేట్లను సవరించింది. ఒక్కో కమర్షియల్ గ్యాస్ కనెక్షన్పై 36 రూపాయలను తగ్గించినట్లు వెల్లడించింది. ఈ తాజా చర్యతో దేశ రాజధానిలో ఒక్కో సిలిండర్ రేటు 2,012 రూపాయల నుంచి 1,976 రూపాయలకు చేరింది. ముంబైలో రూ.1,936.50 నుంచి రూ.1,972.50 పైసలకు తగ్గింది. కోల్కతలో 2,132 రూపాయల నుంచి 2,095కు చేరింది. చెన్నైలో 2,177 నుంచి 2,141 రూపాయలకు పడింది.
గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు పంపిణీ చేసే గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో సబ్సిడీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఒక్కో గ్యాస్ కనెక్షన్పై 200 రూపాయల సబ్సిడీని ఇచ్చింది.












Click it and Unblock the Notifications