కామెరూన్ రాయల్టీ చెల్లించాలి: మోడీ ఛలోక్తులు, నవ్వులు
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలను వేరు చేయడానికి ప్రపంచ దేశాలు ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదంపై నిజాయితీగా పోరు చేస్తున్న దేశాలకు బాసటగా నిలిచే విషయంలోనూ ఒక్కమాటపై నిలవాలన్నారు.
గురువారం రాత్రి 9.20 గంటలకు బ్రిటిష్ పార్లమెంటులోని రాయల్ గ్యాలరీలో ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. రాయల్ గ్యాలరీలో ఎంపీలనుద్దేశించి ప్రసంగిస్తున్న తొలి భారత ప్రధాని మోడీనే. దీంతో మోడీ అక్కడికి అడుగుపెట్టగానే, బ్రిటన్ ఎంపీలంతా నిల్చొని మోడీకి ఘన స్వాగతం పలికారు.
పార్లమెంట్లోని రాయల్ గ్యాలరీ నుంచి ప్రధాని మోడీ 25 నిమిషాల పాటు ప్రసంగించారు. తన ప్రసంగంలో భారత్, బ్రిటన్ దేశాల మధ్య ఉన్న సంబంధాలతో పాటు పరోక్షంగా పాకిస్థాన్ను ఉద్దేశిస్తూ ఉగ్రవాద బెడదపై మాట్లాడారు. ఉగ్రవాదమనేది ప్రస్తుత శకానికి సవాల్గా నిలుస్తోందనీ, దీనిపై ప్రపంచమంతా ముక్తకంఠంతో మాట్లాడి, దానిని అణిచివేసే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్న మోడీ ప్రస్తుత సమాజానికి కూడా ఆధునికత ప్రమాణం లండనేనన్నారు. ‘భారత్ ప్రపంచ దేశాలకు ఇప్పుడు అవకాశాల స్వర్గధామం. ఈ సమయంలో మీరు భారత్లో పర్యటిస్తే ఆ సానుకూల మార్పును మీరు కూడా గుర్తిస్తారు' అన్నారు. భారత్లో ‘సమాఖ్య వ్యవస్థ స్థానంలో టీమ్ ఇండియా' భావనను తీసుకువచ్చామన్నారు.
భారత్, బ్రిటన్ల చరిత్రాత్మక భాగస్వామ్యం గురించి చెబుతూ భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తాజా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్లను మోడీ గుర్తు చేశారు. మోడీ ప్రసంగంలోని చతురోక్తులకు బ్రిటన్ ఎంపీలు పలుమార్లు నవ్వులతో స్పందించారు. ఇటీవలి ఎన్నికల్లో కామెరాన్ ఉపయోగించిన నినాదం ‘ఫిర్ ఏక్ బార్... కామెరూన్ సర్కార్'' అనేది తనదేనని, ఆ నినాదంతోనే కామెరూన్ ఆ ఎన్నికల్లో విజయం సాధించారని మోడీ చెప్పారు.
తానిచ్చిన నినాదంతో విజయం సాధించిన కామెరూన్, తనకు రాయల్టీ చెల్లించాల్సి ఉందని కూడా మోడీ చమత్కరించారు. ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంటు సమావేశాలు జరగడం లేదని, ఈ కారణంగానే కామెరూన్ మోములో విశ్రాంతి కనిపిస్తోందని కూడా మోడీ అన్నారు.
భారత్, బ్రిటన్ మధ్య నెలకొన్న బలమైన సంబంధాలను ప్రస్తావించిన మోడీ ప్రస్తావిస్తూ... ‘‘బ్రూక్ బాండ్ టీ, జాగ్వార్ తదితర వస్తువులు భారతీయ వస్తువులా? బ్రిటన్ వస్తువులా? అన్నది చెప్పడం కష్టం. అంతలా భారత్, బ్రిటన్ లు కలిసిపోయాయి. భారత్ లోని ప్రతి ఔత్సాహిక ఫుట్ బాల్ క్రీడాకారుడు తాను డేవిడ్ బెక్ హాంలా తయారు కావాలని కోరుకుంటాడు. ఇది ఇరు దేశాల మధ్య భావోద్వేగాలకు నిదర్శనం'' అని మోడీ అన్నారు.
ఆశలకు, అవకాశాలను సరికొత్త వెలుగుచుక్కగా భారత్ అవతరిస్తోందన్నారు. రక్షణ, వాణిజ్యం, గృహనిర్మాణం, సేవలు, తదితర రంగాల్లో భారత్లో అపార అవకాశాలున్నాయి. భారత్లో పాలనలో పారదర్శకత, నిర్ణయాల్లో వేగం, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ మొదలైన సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
గాంధీజీ చెప్పిన ప్రకారం మార్పు మాలోనే ప్రారంభమైంది. అందరికి విద్యుత్తు, తాగునీరు, ఇల్లు, పారిశుద్ధ్య వసతి మొదలైన లక్ష్యాల సాధనకు గడవును నిర్దేశించుకుని పని చేస్తున్నామన్నారు. భారతీయ చరిత్రలో చాలా భాగం బ్రిటన్ పార్లమెంట్లోనే లిఖితమైందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.