భయం, డ్రామా, ఉపఉత్పత్తి: పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై ప్రియాంక, లాలూ, చిదంబరం
న్యూఢిల్లీ: దీపావళి పండగ కానుకగా కేంద్రం ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి కొంత ఊరట కల్పించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో బీజేపీకి జరిగిన భంగపాటే ఈ నిర్ణయానికి కారణమంటున్నారు ప్రియాంక గాంధీ.
కేంద్ర ప్రభుత్వం.. భయంతోనే ఈ నిర్ణయం తీసుకుందే తప్ప మనస్ఫూర్తిగా కాదు. పండగకు ముందు ద్రవ్యోల్బణాన్ని, తగ్గించాల్సింది పోయి.. నిత్యావసర ధరలను భారీగా పెంచింది. ఎన్నికల ముందు కంటితుడుపుగా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం చేసిన దోపిడీని తిరిగి రాబట్టాలంటే.. వచ్చే ఎన్నికల్లో తగిన సమాధానం చెప్పాల్సి ఉంటుందని ప్రియాంక గాంధీ వాద్రా సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడాన్ని బీజేపీ నేతలు దీపావళి కానుక అంటుండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి మాత్రం ఇది ఉపఎన్నికల ఉపఉత్పత్తి అంటూ సోషల్ మీడియా వేదికగా ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన 30 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాల ఉపఎన్నికల ఫలితమే ఈ ఉప ఉత్పత్తి. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అధిక సుంకాలే చమురు ధరల పెరుగుదలకు కారణమన్న మా వ్యాఖ్యలు ఇప్పుడు నిజమమయ్యాయి. కేంద్రం దురాశే ఈ అధిక సుంకాలకు కారణమవుతోందని చిదంబరం విమర్శించారు.
మరోవైపు ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కూడా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇది నిజమైన ఊరట కాదని అన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే మళ్లీ ఇంధన ధరలు పెంచేస్తారని లాలూ అన్నారు. సాధారణ వైద్య పరీక్షల కోసం బుధవారం లాలూ ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన పెట్రోల్, డీజిల్ ధరలపై స్పందించారు. రూ. 5 కాదు, రూ. 50 తగ్గిస్తే ప్రజలకు ఉపశమనం కలగుతుందన్నారు. రూ. 5 తగ్గించి కేంద్రం డ్రామాలాడుతోందన్నారు. మరోవైపు ఆయన తనయుడు, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. ఇంధన ధరలను మళ్లీ రూ. 70కి తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు.
Recommended Video
చమురు ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం పెట్రోల్పై రూ. 5, డీజిల్పై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. గురువారం నుంచే తగ్గిన ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గించిందని కాంగ్రెస్ తోపాటు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.