హత్రాస్ గ్యాంగ్ రేప్.. వాల్మీకి కుల సంఘాల సంఘీభావం... అందరూ గొంతెత్తాలన్న ప్రియాంక..
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత(వాల్మీకి) యువతి గ్యాంగ్ రేప్ ఘటనకు నిరసనగా శుక్రవారం(అక్టోబర్ 2) న్యూఢిల్లీలోని పంచకుల మార్గ్లో ఉన్న వాల్మీకి ఆలయంలో వాల్మీకి కుల సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మృతురాలికి సంతాపంగా అంతా రెండు నిమిషాల సేపు మౌనం పాటించారు. బాధిత కుటుంబానికి సంఘీభావంగా వాల్మీకి కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ప్రతీ ఒక్కరూ గొంతెత్తాలని...
సమావేశంలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ... హత్రాస్ బాధితురాలికి,ఆ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై ప్రతీ ఒక్క భారతీయుడు గొంతెత్తాలని అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి ఎలాంటి సహాయం అందలేదన్నారు. 'ప్రస్తుతం ఆ కుటుంబం ఒంటరితనంలో ఉంది... ఇలాంటి తరుణంలో వాల్మీకి కుల సంఘం ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి మద్దతుగా ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియడంతో ఇక్కడికి వచ్చాను. ఆమె కుటుంబం గానీ,వాల్మీకి కమ్యూనిటీ గానీ ఇప్పుడు ఒంటరితనంలో ఉన్నామని భావించకూడదు...' అని ప్రియాంక పేర్కొన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా...
'మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా... అందరూ గొంతెత్తండి... మీడియా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి... మనమంతా కలిసి రాజకీయంగా ఒత్తిడి తీసుకురావాలి...ప్రతీ మహిళ ఈ విషయంలో ముందుకు రావాలి... అంత్యక్రియలకు కన్నతండ్రిని,సోదరుడిని కూడా అనుమతించకపోవడం మన కల్చర్ ఎంతమాత్రం కాదు.... దీన్ని ఉపేక్షించకూడదు...' అని ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. డిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(DPCC) చీఫ్ అనిల్ చౌదరితో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాల్మీకి కమ్యూనిటీ నాయకులకు సంఘీభావం ప్రకటించారు.

కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు..
గురువారం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ హత్రాస్ పర్యటనకు బయలుదేరడం,పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన సంగతి తెలిసిందే. రాహుల్ కాన్వాయ్ని అడ్డుకున్న పోలీసులు అక్కడి నుంచి వెనక్కి వెళ్లాల్సిందిగా చెప్పారు. దీంతో రాహుల్ కాలి నడకనే ముందుకు సాగారు. అయితే పోలీసులు అడ్డు చెప్పడం... అందుకు రాహుల్ ససేమిరా అనడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో రాహుల్ కింద పడిపోయారు. ఈ ఘటనపై కాంగ్రెస్ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. బీజేపీ,ఆర్ఎస్ఎస్ నేతలకు మాత్రమే రోడ్డుపై నడిచే హక్కు ఉందా అంటూ రాహుల్ ప్రశ్నించారు. మరోవైపు,ఈ ఘటనకు సంబంధించి కరోనా నిబంధనలను అతిక్రమించారన్న ఆరోపణలతో రాహుల్,ప్రియాంక సహా 153 మంది కాంగ్రెస్ కార్యకర్తలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications