ప్రియాంక గాంధీ ఎఫెక్ట్: హెల్మెట్ లేదని ఎమ్మెల్యేకు 6 వేల జరిమానా.. పోలీసుల నిర్వాకం
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని వాహనంపై ఎక్కించుకొని తీసుకెళ్లిన నేతకు లక్నో ట్రాఫిక్ అధికారులు భారీ జరిమానా విధించారు. ఇటీవల లక్నోలో ఐపీఎస్ అధికారి ఎస్ఆర్ దారాపురిని కలిసుకునేందుకు వెళ్లగా ప్రియాంకను అధికారులు అడ్డుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన కాంగ్రెస్ నేతపై ట్రాఫిక్ అధికారులు గట్టిగానే జరిమానా కొరడా ఝుళిపించారు.
టూవీలర్ పై ప్రియాంకా గాంధీ: హెల్మెట్ లేకుండా.. భారీగా చలానా వడ్డింపు..!
ఎమ్మెల్యేలపై అధికారులు
రాజస్థాన్ జాహజ్పూర్ ఎమ్మెల్యే ధీరజ్ గుర్జార్ ట్రాఫిక్ అధికారుల కన్నెర్రకు గురయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా, ఉత్తర ప్రదేశ్ ఇంచార్జిలో ఒకరిగా సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలో భాగంగా శనివారం దారాపూరి నివాసం వద్ద అధికారులు ప్రియాంకను అడ్డగించడం వివాదాస్పదమైంది. కార్యకర్తలను అరెస్ట్ చేసిన ఐపీఎస్ అధికారిని కలువడానికి వెళ్లిన సమయంలోనే అక్కడ గందరగోళం నెలకొన్నడం జాతీయస్థాయిలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
ప్రియాంకను వాహనంపై తీసుకెళ్లగా
ఇక ఆ సమయంలో ప్రియాంకను వాహనంపైన తీసుకెళ్లిన సమయంలో ధీరజ్ గుర్జార్ తలపై హెల్మెట్ లేకపోవడంతో ట్రాఫిక్ అధికారులు గమనించి చలాన్ రశీదును అందించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపినందుకు రూ.6100 జరిమానా విధించారు. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే ధీరజ్ గుర్జార్ వెల్లడించడం గమనార్హం.
లక్నో అధికారుల అత్యుత్సాహం
లక్నో అధికారుల అత్యుత్సాహంపై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఐపీఎస్ దారాపూరిని ఆయన నివాసంలో కలిసి బయటకు వచ్చిన తర్వాత శాంతియుతంగానే వెళ్లాను. కానీ శాంతి భద్రతల సమస్య తలెత్తిందనే కారణంపై నన్ను అడ్డుకొన్నారు. ఎలాంటి గందరగోళం లేకుండా వెళ్తున్న క్రమంలోనే నన్ను అడ్డుకొని దురుసుగా ప్రవర్తించారు. నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు అని ప్రియాంక గాంధీ వెల్లడించారు.
ఉద్దేశపూర్వకంగానే వెంటాడారు
ఎమ్మెల్యే ధీరజ్ వాహనంపై వెళ్తుండగా నన్ను ఉద్దేశపూర్వకంగానే పోలీసులు వెంటాడారు. ఆ తర్వాత నేను పాదయాత్రగా వెళ్తుంటే కిలోమీటర్ నా వెంట వచ్చారు. దాంతో నేను మళ్లీ వాహనం ఎక్కి వెళ్లాను. ఆ సమయంలో మున్షిపులియా అనే ప్రాంతంలో నన్ను ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసుల నాతో దారుణంగా వ్యవహరించారు అని ప్రియాంక గాంధీ అన్నారు.