నో జాబ్స్, నో అగ్రికల్చర్ : ఓన్లీ పాకిస్థాన్, మోదీ సర్కార్పై ప్రియాంక గుస్సా
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ ప్రచార పర్వలో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. తన ప్రత్యర్థి బీజేపీ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేస్తున్నారు. రెండోవిడత ప్రచార పర్వంలోనూ తన దూకుడును కొనసాగిస్తున్నారు. సోమవారం ఆగ్రాలో ప్రచారం నిర్వహించారు ప్రియాంక.
ఉద్యోగాలేవి ?
ఎన్నికల వేళ బీజేపీ ఉద్యోగాలు గురించి ప్రస్తావించాలి. ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న అంశంపై యువతకు క్లారిటీ ఇవ్వాలి. వ్యవసాయం, రైతుల సమస్యలను పరిష్కరించాలి .. కానీ బీజేపీకి ఇవేం పట్టవు అని విమర్శించారు ప్రియాంక గాంధీ. ఆ పార్టీకి ఒక పాకిస్థాన్పై చేసిన దాడి ఒక్కటే గుర్తుంది అని మండిపడ్డారు. దేశం, జాతీయత గురించి మాత్రమే మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నివర్గాలను వంచించారు
ఉద్యోగాలు, రైతులే కాదు .. ఇతర సామాజిక వర్గాలకు, మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. మహిళ, మహిళా భద్రత కోసం చేసిందెంటో చెప్పాలని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలు, సంస్థల పట్ల విచక్షనతో వ్యవహరించాలని, కానీ ఈ ఐదేళ్లలో జరిగిందేంటి అని ప్రియాంక లేవనెత్తారు.
ప్రశ్నిస్తే .. జాతి వ్యతిరేక ముద్ర
మోదీ హయాం నియంతృత్వానికి పరాకష్ట అని విమర్శించారు ప్రియాంక. ఇటీవల ఓ రైతు తాను పండించిన పంటకు మద్దతు ధర రాలేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి. దీంతో ఆయన పంటకు వచ్చిన రూ.490 నగదును ప్రధాని మోదీకి పంపించారని గుర్తుచేశారు. ఆ రైతు ఆవేదననకు అర్థం చేసుకోవాల్సిన పాలకులు .. జాతి వ్యతిరేక ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.