జమ్మూలో దౌలతుల్ ఇస్లాం కార్యకలాపాలు: హోం శాఖ రిపోర్ట్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో దౌలతుల్ ఇస్లాం కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లోని ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నా మహిళా గ్రూప్ ఐసీస్ సిద్దాంతాలను బలపరుస్తూ ప్రసంగాలు చేస్తున్నాయని కేంద్ర హోంశాఖమంత్రిత్వశాఖ నివేదికను వెల్లడించింది.
జమ్మూ రాష్ట్రంలోని ఐసిస్ అనుకూల మహిళా గ్రూప్ దౌలతుల్ ఇస్లాం కదలికలు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన నివేదికతో ఆ రాష్ట్రం అప్రమత్తమైంది.
అనంత్నాగ్లో ఓ ఉగ్రవాది హత్య తర్వాత తొలిసారిగా కాశ్మీర్లో దౌలతుల్ ఇస్లాం సభ్యుల కార్యకలాపాలు వెలుగు చూసినట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ ఉగ్రవాది నివాసాన్ని సందర్శించిన మహిళా గ్రూపు సభ్యులు జీహద్కు అనుకూలంగా ప్రసంగించినట్టు ఆ రిపోర్ట్ తేటతెల్లం చేసింది.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఐసీస్ కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నివేదిక అభిప్రాయపడింది.అయితే ఐసీస్ ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.