ఎన్నికల్లో పోటీ చేయమంటున్న సీనియర్లు ... హర్యానా కాంగ్రెస్ లో విచిత్ర పరిస్థితి
హర్యానా : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది. ఆశావహులు టికెట్ల కోసం తమ పార్టీ అధిష్టానం వద్దకు క్యూ కడుతున్నారు. ఒక్క అవకాశమివ్వండని ఆశగా అడుగుతున్నారు. కానీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల విషయంలో ఆ పార్టీ హైకమాండ్ తర్జనభర్జనలు పడుతోంది. అయితే అది పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువై ఎవరికి టికెట్ ఇవ్వాలన్న విషయంలో కాదు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు ఎవరూ ముందుకు రాకపోవడమే కారణం.
రాహుల్ పై మరోసారి స్మృతీ అస్త్రం... అసలు కథ ఏంటంటే...?
ఎన్నికల్లో పోటీకి సీనియర్ నేతల విముఖత
హర్యానాలో చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదు. ఇటీవల జింద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో పార్టీ పరాజయం పాలవడమే ఇందుకు ప్రధాన కారణం. జింద్ స్థానం నుంచి ఏఐసీసీ ప్రతినిధి రణ్దీప్ సుర్జేవారాను బరిలో దింపినా మూడోస్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మే 12న ఎన్నిక జరగనున్న హర్యానాలో మొత్తం 10 లోక్సభ స్థానాలుండగా.. గత ఎన్నికల్లో బీజేపీ 7, ఐఎన్ఎల్డీ 2 స్థానాలు గెల్చుకోగా.. కాంగ్రెస్ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే దక్కించుకుంది. గత ఎన్నికల ఫలితాలు, తాజా పరిణామాల దృష్ట్యా పార్టీ సీనియర్ నేతలు ఎవరూ పోటీకి మొగ్గుచూపడం లేదు. మరోవైపు పార్టీ పదవుల విషయంలో అసంతృప్తితో ఉన్న మరికొందరు నేతలు ఎన్నికల బరిలో నిలిచేందుకు నిరాకరిస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం మల్లగుల్లాలు
పార్టీలో అసంతృప్తులకు తోడు సీనియర్ నేతలు పోటీకి విముఖత ప్రదర్శిస్తుండటంతో కాంగ్రెస్ హైకమాండ్ కు ఎటూ పాలుపోవడం లేదు. పార్టీలో కీలక పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్న ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యుడు కుల్దీప్ బిష్నోయ్ ఏ సమావేశానికి హాజరుకావడంలేదు. ఇక సీనియర్ నేతలైన నవీన్ జిందాల్, కుమారి సెల్జాలు కూడా పోటీకి ఏ మాత్రం ఉత్సాహం చూపడంలేదు. హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ తన్వార్ మాత్రం సిరపా నుంచి పోటీకి సంసిద్ధత వ్యక్తంచేశారు.
అసెంబ్లీ ఎన్నికలపై మాజీ సీఎం దృష్టి
హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల్లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెడతానన్న సంకేతాలు ఇచ్చారు. పార్టీ అధిష్టానం కోరితే లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని అంటున్నారు. వరుసగా మూడుసార్లు రోహ్తక్ లోక్ సభ స్థానం నుంచి గెలుపొందిన భూపేందర్ సింగ్ హూడా కుమారుడు దీపేందర్ హూడా ఈసారి కూడా అక్కడి నుంచే బరిలో దిగుతున్నారు. ఇక అసంతృప్తి నేత కుల్దీప్ బిష్నోయ్ తన కుమారుడిని హిస్సార్ నుంచి పోటీకి దింపాలని చూస్తున్నారు.