అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత: నింగిలోకి అత్యంత తక్కువ బరువున్న కలాంశాట్
శ్రీహరికొట: అంతరిక్ష రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహంను నింగిలోకి విజయవంతంగా ఇస్రో పంపింది. ఈ ఉపగ్రహం పేరు కలాంశాట్.ఇది సమాచార ఉపగ్రహం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరుతో దీన్ని రూపొందించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు కక్కుతూ నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్ఎల్వీ సీ-44.
నాలుగు దశల్లో ప్రయోగం
గురువారం రాత్రి 11 గంటల 37 నిమిషాలకు పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం నాలుగు దశల్లో కొనసాగింది. పీఎస్ఎల్వీ సీ-44 పీఎస్ఎల్వీ -డీఎల్ను మోసుకెళ్లింది. పీఎస్ఎల్వీలో ఈ కొత్త వేరియంట్ను మోసుకెళ్లడం ఇది తొలిసారి.తొలిదశ ప్రయోగం 13 నిమిషాల్లో ముగిసింది. ఇక 14వ నిమిషంలో డీఆర్డీఓ ఇమేజింగ్ శాటిలైట్ 277 కిలోమీటర్ల ఎత్తులో విడుదల కావడం జరిగింది.వివిధ రంగాలనుంచి ఈ తరహా ఉపగ్రహాలు కావాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. మరో 6 లేదా 7 ఇమేజింగ్ ఉపగ్రహాలను త్వరలో రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు.
నాల్గవ దశలో ఆఫ్ ఆన్ ప్రక్రియ
ఇక జీశాట్-7, జీశాట్-7ఏ ఉపగ్రహాలు మిలటరీకి సమాచారం అందించే ఉపగ్రహాలు కాగా... అంతకు ముందు పంపిన మిగతా ఉపగ్రహాలు ఇటు పౌరసేవలు అటు రక్షణ సేవలకు ఉపయోగపడ్డాయి. పీఎస్ఎల్వీ నింగిలోకి దూసుకెళ్లిన 54 నిమిషాల తర్వాత నాలుగవ దశ రీస్టార్ట్ అయ్యి 16 సెకన్ల వరకు కొనసాగింది ఆ తర్వాత మళ్లీ కట్ అయ్యింది. మళ్లీ వంద నిమిషాలకు నాల్గవ దశ స్విచ్ ఆన్ చేయడం జరిగింది. అనంతరం మళ్లీ కట్ చేయడం జరిగింది. ఇక చివరిగా 103వ నిమిషంలో నాల్గవ దశ విజయవంతమైంది. కలాంశాట్ -వీ2ను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టం జరిగింది.
అత్యంత తక్కువ బరువుగల ఉపగ్రహం
కలాంశాట్ అనేది విద్యార్థులు తయారు చేసిన ఉపగ్రహం. దీని బరువు 1.2 కేజీలు ఉండగా... 10 సెంటీమీటర్ల క్యూబ్ ఆకారంలో దీన్ని రూపొందించారు. ఇందులో అతిచిన్న పేలోడ్ అమర్చారు. దీని ఆధారంగా ప్రయోగాలు చేస్తారు. కలాంశాట్ అనే ఈ ఉపగ్రహం భారత్ నింగిలోకి పంపిన అత్యంత తక్కువ బరువున్న ఉపగ్రహంగా రికార్డు సృష్టించింది. నాలుగు దశలు కలిగిన పీఎస్ఎల్వీలో ఘనదశ, ద్రవ దశలు ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్ 53 సొంత ఉపగ్రహాలు 269 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. చివరిగా గతేడాది నవంబర్ 29న ఇస్రో పీఎస్ఎల్వీ -సీ43 రాకెట్ ద్వారా హైసిస్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.మొత్తానికి అంతరిక్ష రంగంలో ఇస్రో 2019ని విజయవంతంగా ప్రారంభించింది.