విధి వంచితుడు: ఎంతో మందికి ప్రాణం పోశాడు.. ఇప్పుడు తన ప్రాణం తీయమంటున్నాడు
క్లోమ క్యాన్సర్ తో బాధపడుతున్న పూణేకు చెందిన వైద్యుడు ఎంత డబ్బు ఖర్చు చేసినా తన ప్రాణం నిలవదని అర్థమై.. కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
పూణే: తన పాతికేళ్ల వైద్య వృత్తిలో ఆ డాక్టర్ ఎంతో మందికి ప్రాణం పోశాడు. ఇప్పుడు ఆయనకే అనుకోని కష్టం ఎదురైంది. వైద్యం కోసం ఇప్పటికే రూ.లక్షలు ఖర్చయ్యాయి. కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా దిగజారింది. ఇక ఎంత డబ్బు ఖర్చు చేసినా తన ప్రాణం నిలవదని అర్థమైన ఆయన కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.
మహారాష్ట్రలోని పూణేకు చెందిన డాక్టర్ భరత్ మారుతి లోటే గత 26 ఏళ్లుగా రత్నగిరి జిల్లాలోని రాంపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో భరత్ అస్వస్థతకు గురికావడంతో వైద్యులను సంప్రదించారు.
పరీక్షలు చేయించిగా ఆయన క్లోమ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు తెలిసింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని పూణేలోని దీననాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అప్పటికే క్యాన్సర్ చివరి దశలో ఉండడంతో భరత్ కోలుకోవడం కష్టమని, బతికించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తామని అక్కడి వైద్యులు తెలిపారు.
గత ఏప్రిల్ నుంచి మూడు శస్త్రచికిత్సలు చేశారు. ఆయన చికిత్స కోసం ఇప్పటికే భరత్ కుటుంబం రూ.29 లక్షలు ఖర్చు చేసింది. భరత్ భవిష్యనిధి ద్వారా రూ.3 లక్షలు, ఇల్లు, నగరలు తాకట్టు పెట్టి రూ.11 లక్షలు తీసుకొచ్చినట్లు ఆయన భార్య సంగీత తెలిపింది. ఆ డబ్బు చాలక స్నేహితుల నుంచి మరికొంత అప్పుగా తీసుకున్నట్లు పేర్కొంది.
ఇంత చేసినా భరత్ వ్యాధి తగ్గకపోగా రోజురోజుకు ఆయన పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. అసలే మధ్య తరగతి కుటుంబం. ఆపైన వైద్యం కోసం చేసిన అప్పులు. తన భర్త చికిత్స కోసం భరత్ జీతాన్ని ముందుగానే ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య రాష్ట్ర వైద్య శాఖకు అర్జీ పెట్టుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు.
ఇక ఇలాగే ఉంటే... తన కుటుంబం మరింత కష్టాల్లో కూరుకుపోతుందని భావించిన డాక్టర్ భరత్ తనకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలంటూ కోరుతున్నారు. ఈ మేరకు ఇటీవల ఆయన మాట్లాడిన వీడియో ఒకటి విడుదల చేశారు.
'నా చికిత్స వల్ల మా కుటుంబం ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటుంది. అందుకే మానవత్వంతో చనిపోడానికి నాకు అనుమతినివ్వండి' అంటూ డాక్టర్ భరత్ ఆ వీడియో మెసేజ్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కారుణ్య మరణం కోసం భరత్ కుటుంబం ఓ న్యాయవాదిని కూడా సంప్రదించింది. త్వరలోనే దీనిపై బాంబే హైకోర్టులో పిటిషన్ కూడా వేయనున్నారు.