అనుమానాస్పదం: సొంత ఫ్లాట్లో ఉరేసుకుని టెక్కీ దంపతులు, నేలపై బాలుడు
Recommended Video
పుణె: మహారాష్ట్రలోని పుణెలో విషాద ఘటన చోటు చేసుకుంది. బనేర్ ప్రాంతంలోని తమ సొంత ఫ్లాట్లో 35ఏళ్ల టెక్కీ దంపతులు ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారి నాలుగేళ్ల కొడుకు కూడా అక్కడే నేలపై విగత జీవిగా పడివున్నాడు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దంపతులది ప్రాథమికంగా ఆత్మహత్య అనే నిర్ధారించినప్పటికీ.. ఆ చిన్నారి ఎలా చనిపోయాడన్నదే తెలియడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన జయేష్ పటేల్(35), అతని భార్య భూమిక(30), కుమారుడు నక్ష్(4) గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.
'ఈరోజు(శుక్రవారం) ఉదయం నుంచి జయేష్ పటేల్ తమ ఇంటి తలుపులు తెరవకపోవడంతో పొరుగింటి వారికి అనుమానం కలిగింది. దీంతో హౌసింగ్ సొసైటీకి, పోలీసులకు సమాచారం ఇచ్చారు' అని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేసరికి ఆ దంపతులిద్దరూ ఉరివేసుకుని ఉన్నారని, నేలపై బాలుడు చనిపోయి ఉన్నాడని తెలిపారు. పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాతే నక్ష్ ఎలా చనిపోయాడనేది తేలుతుందనిచెప్పారు.
నక్ష్ తరచూ అస్వస్థతకు గురయ్యేవాడని, అతని ఆరోగ్యం గురించే జయేష్ దంపతులు ఆందోళన చెందుతూ ఉండేవారని అతని స్నేహితులు, బంధువులు తెలిపారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.