నగర కీర్తనలో భారీ పేలుడు: 14 మంది దుర్మరణం: భయానకంగా సంఘటనా స్థలం.. !
చండీగఢ్: పంజాబ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం సంభవించిన పేలుడులో 14 మంది వరకు దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. గాయపడ్డ వారిని అత్యవసర చికిత్సను అందిస్తున్నారు.
పంజాబ్లోని తర్న్ తరన్లో ఈ పేలుడు చోటు చేసుకుంది. సిక్కులు నగర కీర్తన నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిక్కుల మత గురువు బాబా దీప్సింగ్ జన్మస్థలం పహువిండ్లో నగర కీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కు భక్తులు పెద్ద ఎత్తున బాణాసంచాను వినియోగించారు. ఓ వాహనంలో బాణాసంచాను తరలిస్తూ.. వాటిని పేల్చుతూ సందడి చేశారు. ప్రమాదాశావత్తూ శక్తిమంతమైన బాణాసంచా భారీ శబ్దం చేస్తూ ఒక్కసారిగా పేలిపోయింది.
ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. బాణాసంచాను తరలిస్తోన్న వాహనం తునాతునకలైంది. అందులో ఉన్న భక్తులు చెల్లాచెదురు అయ్యారు. వారి మృతదేహాలు విసిరి వేసినట్లు పడిపోయాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు భక్తుల కాళ్లు, చేతులు విరిగిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ ఘటన చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం.. బాణాసంచా పేలుడేనని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఉద్దేశపూరకంగా అత్యంత ప్రమాదకరమైన మందుగుండును బాణాసంచాలో కలిపి ఉండొచ్చని వాదనలు వినిపిస్తున్నాయి.