లక్కున్నోడు: రూ.200 పెట్టుబడితో కోట్లు సొంత చేసుకున్న కానిస్టేబుల్
అదృష్టం అనేది ఎప్పుడో కానీ తలుపు తట్టదు. ఒకసారి తట్టిందో అంతే తలరాతలే తారుమారవుతాయి. అప్పటి వరకు కటిక పేదరికంలో జీవించిన వ్యక్తి ఒక్కసారిగా అపర కుబేరుడవుతాడు. సుబ్బిగాడు కాస్త సుబ్బరాజుగారు అవుతారు. జీవితంలో అదృష్టం ఎప్పుడు తలుపు కొడుతుందా... దాన్ని ఎప్పుడు ఆహ్వానిస్తామా అంటూ కొందరు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వారి దగ్గరకు అదృష్టం అనేది కలగానే మిగిలిపోతుంది. కొందరికైతే అనుకోకుండా వారి జీవితంలోకి అదృష్టం ప్రవేశిస్తుంది. జీవితంలో పెనుమార్పులు తీసుకొస్తుంది. ఇలాంటి అదృష్టమే ఓ పోలీస్ కానిస్టేబుల్ జీవితంలో ప్రవేశించింది.
అదృష్టం జలుబు పట్టుకున్నట్లు పట్టింది
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అశోక్ కుమార్. పంజాబ్లోని హోషియార్ పూర్లో ఉన్న సర్దార్ పోలీస్ స్టేషన్లో సాధారణ కానిస్టేబుల్. నెల జీతంతోనే ఆయన ఇల్లు గడిచేది. అనుకోకుండా అశోక్కుమార్ను అదృష్టం జలుబు పట్టుకున్నట్లు పట్టింది. ఆ అదృష్టం అలాంటి ఇలాంటిది కాదు.. ఏకంగా కోటీశ్వరుడిని చేసింది.
అదృష్టం పరీక్షించుకుందామనుకున్నాడు
ఇక అసలు విషయానికొస్తే... కానిస్టేబుల్ అశోక్ కుమార్ ఓ రోజు పోలీస్ స్టేషన్లో తన విధులు నిర్వర్తిస్తుండగా అక్కడికి లాటరీలు అమ్ముకుంటూ ఓ వ్యక్తి వచ్చాడు. లాటరీ టికెట్ కొనాల్సిందిగా ఆ వ్యక్తి అశోక్ కుమార్ను కోరాడు. ముందుగా తిరస్కరించిన అశోక్ కుమార్ ఆ తర్వాత కొనేందుకు మొగ్గు చూపాడు. రూ. 200 చెల్లించి ఓ లాటరీ టికెట్ కొని తన అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నాడు. లాటరీని కొన్నాడు.
రూ. 200 వెచ్చించి రూ.2కోట్లు గెలిచాడు
బుధవారం సాయంత్రం అశోక్కుమార్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. రెండు కోట్ల రూపాయల లాటరీ తగిలిందంటూ అవతల వ్యక్తి చెప్పాడు. ముందు నమ్మలేదు. ఒక్కింత షాక్కు గురయ్యాడు. తాను కొన్న లాటరీ టికెట్ పోలీస్ స్టేషన్లోనే ఉంచి మరిచిపోయాడు. వెంటనే షాక్ నుంచి తేరుకుని పోలీస్ స్టేషన్కు పరుగులు తీశాడు. ఆయాస పడుకుంటూ పోలీస్ స్టేషన్కు చేరుకుని వెంటనే ఆ లాటరీ తీసుకుని నెంబరును సరిపోల్చుకున్నాడు. ఓ మై గాడ్ అంటూ ఒక్కసారిగా గాల్లోకి సంబరంతో గంతులు వేశాడు. నెంబరు సరిపోలడంతో తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోయాడు.
షాక్ నుంచి తేరుకోలేకపోయిన అశోక్
తొమ్మిదేళ్ల క్రితం పోలీస్ శాఖలో తాను చేరినట్లు చెప్పిన అశోక్... ఈ మధ్యే తన సొంత ఊరిలో ఇళ్లు కట్టుకున్నట్లు వెల్లడించాడు. ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఈ లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో కొనొచ్చని చెప్పాడు. ఇక కోటీశ్వరుడిగా మారిన అశోక్కు గొప్పింటి పెళ్లి సంబంధాలు వస్తాయని అతని సహోద్యోగులు చెప్పారు. లాటరీ టికెట్ కొనడం ఇది రెండో సారి అని ఈ సారి కచ్చితంగా రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని తమాషాగా లాటరీ టికెట్లు అమ్మే వ్యక్తితో చెప్పినట్లు తెలిపాడు అశోక్. ఇప్పుడు తమాషాగా చెప్పిన మాటలే నిజమవుతాయని కలలో కూడా అనుకోలేదని చెప్పి అశోక్ సంబరాల్లో మునిగిపోయాడు.