నన్ను కొట్టారు, నా కొడుకును టర్బన్ కూడా ధరించనివ్వలేదు: పంజాబ్ పోలీసులపై తజిందర్ బగ్గా తండ్రి
న్యూఢిల్లీ: బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా అరెస్ట్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. అరెస్టు చేసే సమయంలో పంజాబ్ పోలీసులు దారుణంగా వ్యవహరించారని తజిందర్ బగ్గా తండ్రి ప్రీత్ పాల్ సింగ్ మండిపడ్డారు. పంజాబ్ పోలీసులు తనపై చేయి కూడా చేసుకున్నారని, ముఖంపై కొట్టారని ఆరోపించారు. తన కుమారుడు తర్బన్ ధరించేందుకు కూడా అనుమతివ్వలేదని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
జానకిపురిలోని తమ నివాసంలో పంజాబ్ పోలీసుల విధ్వంసం సృష్టించారని బగ్గా తండ్రి ప్రీత్ పాల్ సింగ్ ఆరోపించారు. జానకిపురి పోలీసులకు ఫిర్యాదు చేసే సమయంలో ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ ఆదేశ్ గుప్తా కూడా బగ్గా తండ్రి వెంట ఉన్నారు. తాము బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసిన తర్వాత ఇద్దరు పంజాబ్ పోలీసులు ఇంట్లోకి వచ్చారని బగ్గా తండ్రి తెలిపారు.
ఇంట్లోకి వచ్చిన ఇద్దరు పంజాబ్ పోలీసులకు టీ కూడా ఆఫర్ చేశామని ప్రీత్ పాల్ తెలిపారు. అయితే, ఆ తర్వాత 10-15 మంది పోలీసులు వచ్చి కూర్చిలో కూర్చున్న తజిందర్ పాల్ సింగ్ బగ్గాను బలవంతంగా బయటకు లాక్కెళ్లారని.. అతడు తన టర్బన్ ను ధరించేందుకు కూడా అనుమతివ్వలేదని ప్రీత్ పాల్ మండిపడ్డారు. ఈ వ్యవహారాన్ని తాను మొబైల్ ఫోన్లో రికార్డు చేస్తుండగా.. ఫోన్ పగలగొట్టి, తనపై దాడి చేశారని తెలిపారు.
బగ్గా తండ్రిపై దాడి చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆదేశ్ గుప్తా తెలిపారు. తజిందర్ బగ్గా, ఆయన కుటుంబం పట్ల పంజాబ్ పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గు చేటని అన్నారు. వయసులో పెద్దవారైన బగ్గా తండ్రిని కొట్టమని కేజ్రీవాల్ పంజాబ్ పోలీసులను ఆదేశించారా? అని ప్రశ్నించారు. పంజాబ్ పోలీసులు గూండాల్లా వ్యవహరించారని, సిక్కు అయిన బగ్గాను టర్బన్ ధరించేందుకు కూడా అనుమతివ్వలేదని మండిపడ్డారు.
దుమారం రేపుతున్న తజిందర్ బగ్గా అరెస్ట్ వ్యవహారం
బీజేపీ యువ మోర్చా జాతీయ అధికార ప్రతినిధి తజిందర్ పాల్ బగ్గాను శుక్రవారం ఉదయం పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను బెదిరింపులకు గురిచేసిన కేసులో ఈ అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. అయితే, ఈ అరెస్ట్ జరిగిన కొద్ది గంటల్లోనే.. ఢిల్లీ పోలీసులు పంజాబ్ పోలీసులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు ఈ చర్యకు దిగారు.
'కాశ్మీర్ ఫైల్స్'పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నివాసం ఎదుట ఇటీవల బీజేపీ యువ విభాగం నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సమయంలో తజిందర్ పాల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై పంజాబ్లోని మొహాలీకి చెందిన ఆప్ నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా కేసు నమోదు చేసిన పంజాబ్ పోలీసులు.. దర్యాప్తునకు హాజరుకావాలంటూ గతంలో పలుమార్లు తజిందర్కు నోటీసులు జారీ చేశారు. వాటికి స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో తజిందర్ బగ్గాను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 10-15 మంది పోలీసులు తమ ఇంటికి వచ్చి దాడి చేశారని తజిందర్ తండ్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని ఎక్కడికో తీసుకెళ్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక, తమపై పంజాబ్ పోలీసులు దాడి చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులపై ఢిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తజిందర్ అరెస్ట్ గురించి పంజాబ్ పోలీసులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
కాగా, ఢిల్లీ పోలీసులు సూచనలతో తజిందర్ బగ్గాను తీసుకెళ్తున్న పంజాబ్ పోలీసులను కురుక్షేత్ర వద్ద హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు ఇక్కడికి చేరుకుని తజిందర్ పాల్ సింగ్ బగ్గాను మళ్లీ ఢిల్లీకి తరలించారు. కాగా, పంజాబ్ పోలీసులు తజిందర్ బగ్గాను అరెస్ట్ చేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కేజ్రీవాల్ పంజాబ్ పోలీసులను తన మాఫియా కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తదప్పదని హెచ్చరిస్తున్నారు.