ఆ సర్టిఫికెట్ లేకపోతే..ఒక్క రూపాయి జీతం ఇవ్వం: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్: జనవరి 1 నుంచి
చండీగఢ్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్సీ, ఫిట్మెంట్ కోసం పోరుబాట పట్టారు. సమ్మెకు దిగుతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. తమతో పెట్టుకున్న ఏ అధికార పార్టీ కూడా బతికి బట్టకట్టలేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. వారికి అండగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లకు గొంతు కలిపింది. ఉద్యోగులను జగన్ సర్కార్ అన్యాయం చేస్తోందంటూ మండిపడింది. లక్షలాది మందిగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులతో ఘర్షణ వైఖరికి దిగాలని ఏ అధికార పార్టీ కూడా కోరుకోదు.

కుదుటపడుతున్న సమయంలో..
బతిమాలో.. నచ్చజెప్పో.. వారి డిమండ్లను కాస్త అటుఇటుగానైనా ఆమోదిస్తుంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఏ మాత్రం ఆదాయం లేకపోయినప్పటికీ- ఉద్యోగులు మాత్రం తమ డిమాండ్ల కోసం ఉద్యమించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకవంక కరోనా వైరస్ వల్ల విధించాల్సిన వచ్చిన లాక్డౌన్ పరిస్థితుల వల్ల రాష్ట్రాల ఖజానాకు రావాల్సిన ఆదాయం దిగజారింది. కొంతవరకు కుదుటపడుతున్న ఈ సమయంలో మళ్లీ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది.

పంజాబ్ సంచలన నిర్ణయం..
ఈ పరిస్థితుల్లో పంజాబ్ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. వ్యాక్సిన్ సర్టిఫికెట్ అందజేయని ప్రభుత్వ ఉద్యోగులకు జీతం నిలిపివేస్తామని ప్రకటించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. జనవరి 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. జనవరి 1వ తేదీ నాటికి వ్యాక్సిన్ సర్టిఫికెట్ను అందజేయని ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క రూపాయి జీతం కూడా ఇవ్వబోమని కరాఖండిగా తేల్చి చెప్పింది. పదవీ విరమణ చేసి, పింఛన్ పొందుతోన్న వారికి కూడా ఈ విధానాన్ని వర్తింపజేసింది.

నో వ్యాక్సిన్ సర్టిఫికెట్..నో శాలరీ..
జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో నో వ్యాక్సిన్ సర్టిఫికెట్.. నో శాలరీ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపింది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా.. డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నా దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ- రోజువారీ వ్యాక్సిన్ల సంఖ్య తగ్గుతూ ఉండటం వల్ల ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చినట్లు చెబుతున్నారు.

మిశ్రమ స్పందన..
ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి సాహసించదు. ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటుంది. పంజాబ్ ప్రభుత్వం మాత్రం ఏ మాత్రం వెనుకాడనట్టే కనిపిస్తోంది. కరోనా వైరస్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందడాన్ని నిరోధించడానికి ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొన్ని ఉద్యోగ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండటం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో..
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీనికోసం ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ ఛన్నీ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమాయాత్తమౌతోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి సమరశంఖాన్ని పూరించింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో ఏ పార్టీ కూడా ఘర్షణ వైఖరికి దిగదు. అందులోనూ అసెంబ్లీ ఎన్నికల ముంగింట్లో వారికి ఆగ్రహాన్ని కలిగించే చర్యలు, నిర్ణయాలు తీసుకోదు. దీనికి భిన్నంగా చరణ్జిత్ సింగ్ ఛన్నీ సర్కార్ జారీ చేసిన ఈ ఉత్తర్వులు కలకలం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications