పంజాబ్లో అధికారం మాదే.. పటియాలాలో అమరీందర్ సింగ్ నామినేషన్ దాఖలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. నామినేషన్ ఘట్టం ఊపందుకుంది. ప్రధాన పార్టీలకు చెందిన సీనియర్ నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. పటియాల అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.
Recommended Video
పటియాల నుంచి అమరీందర్ సింగ్ పోటీ
నామినేషన్ ముందు కెప్టెన్ అమరీందర్ సింగ్ గురుగోవింద్ సాహిబ్ ఖడ్గం నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. గురుగోవింద్ సాహిబ్లోని మత పెద్దలు ఆయనకు ఖడ్డం ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ర్యాలీగా బయలు దేరి వెళ్లారు. పటియాలా స్థానం నుంచి పోటీ చేస్తున్న అమరీందర్ సింగ్ .. ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.
అధికారం మా కూటమిదే..
అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తమకు కలిసివస్తాయన్నారు. పంజాబ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ సిద్ధూ తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ పరిస్థితి రావడానికి సిద్ధూయే కారణమని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు.
ఫిబ్రవరి 20 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
కెప్టెన్ అమరీందర్ సింగ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో అర్థాంతరాంగా తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికార పగ్గాలు దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. పంజాబ్లో ఫిబ్రవరి 20 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడికానున్నాయి.