లూథియానా కోర్టులో పేలుడు కేసు-ఖలిస్తాన్, డ్రగ్ స్మగ్లర్ల పాత్ర-పంజాబ్ పోలీసుల గుర్తింపు
పంజాబ్ లోని లూథియానా కోర్టు కాంప్లెక్స్ లో జరిగిన పేలుడుపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై పోలీసులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. దీని ప్రకారం ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించిన వారితో పాటు డ్రగ్ స్మగ్లర్ల పాత్ర ఉందని పంజాబ్ డీజీపీ ప్రకటించారు.
లూథియానా కోర్టు కాంప్లెక్స్లో గురువారం జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తులో ఖలిస్తానీ శక్తులు , గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లకు సంబంధాలున్నాయని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిద్ధార్థ్ చటోపాధ్యాయ తెలిపారు. ఖలిస్తానీ శక్తులు గ్యాంగ్స్టర్లు మరియు డ్రగ్స్ స్మగ్లర్లకు లింక్ ఉన్నట్లు తాము కనుగొన్నట్లు ఆయన వెల్లడించారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నుంచి సవాళ్లను ఎదుర్కొంటున్నామని, నార్కో ఆర్గనైజ్డ్ క్రైమ్, టెర్రరిజం ప్రమాదకరమైన కాక్టెయిల్ అని లూథియానాలో జరిగిన కేసు అలాంటిదేనని ఆయన అన్నారు. 24 గంటల్లో కేసును ఛేదించాని డీజీపీ తెలిపారు. తాము స్పాట్ నుండి అనేక లీడ్లను కనుగొన్నట్లు ఆయన వెల్లడించారు. చిరిగిన బట్టలు, సిమ్ కార్డ్, మొబైల్, చేతిపై టాటూ కనిపించాయన్నారు.
లూథియానా పేలుడు కేసులో అనుమానితుడి వివరాలను కూడా డీజీపీ వెల్లడించారు. మృతుడి వద్ద పేలుడు పదార్థాలు ఉన్నాయని, 24 గంటల్లో ప్రధాన నిందితుడిని కనుగొన్నామని, అతన్ని 2017 లోనే అరెస్టు చేసినట్లు డీజీపీ తెలిపారు. డిసెంబర్ 23, గురువారం, లూథియానాలోని డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు కాంప్లెక్స్లో జరిగిన పేలుడులో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు గాయపడ్డారు. లూథియానా కోర్టు పేలుడు వెనుక పాకిస్థాన్ మద్దతు ఉన్న ఖలిస్థాన్ అనుకూల సంస్థ బబ్బర్ ఖల్సా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు వర్గాలు చెబుతున్నాయి.