పంజాబ్: ఖైదీలు తమ భాగస్వాములతో జైలులోనే ఏకాంతంగా గడపొచ్చు, లైంగికంగానూ కలవొచ్చు
పంజాబ్లో దేశంలోనే మొదటిసారి ఖైదీలు తమ భాగస్వాములతో జైలులో ఏకాంతంగా గడిపేందుకు అనుమతి లభించింది.
60 ఏళ్ల గుర్జీత్ సింగ్ హత్యా నేరం పై జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఆయన గత కొన్ని నెలలుగా పంజాబ్లోని తర్న్ తరన్ గోయింద్వాల్ జైలులో ఉన్నారు.
"జైలు జైలే. ఇక్కడ ఒంటరిగా, దిగులుగా ఉంటుంది" అని అన్నారు. కానీ, నా భార్య జైలులో నన్ను కలిసేందుకు వచ్చినప్పుడు ఇద్దరం కలిసి రెండు గంటల సేపు ఏకాంతంగా గడిపాం. నాకు చాలా ఊరటగా ఉంది" అని అన్నారు.
పంజాబ్ ప్రభుత్వం జైలులో ఉన్న ఖైదీలను వారి భాగస్వాములు కలిసి కొంత సమయం గడిపేందుకు అనుమతివ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో భార్యాభర్తలు సెక్స్లో కూడా పాల్గొనవచ్చు.
"దంపతులు కలిసి చేసే పనులు చాలా ఉంటాయి. పెళ్లి అనే బంధం ప్రేమతో, స్వచ్చతతో కూడుకుని ఉంటుంది. ప్రభుత్వం ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టినప్పుడు, వాటిని మేం వినియోగించుకోవాలి" అని గుర్జీత్ అన్నారు.
గోయింద్వాల్ జైలులో ఈ పథకాన్ని వినియోగించుకున్న వారిలో ఈయన మొదటి వ్యక్తి.
ఈ పథకం ప్రవేశపెట్టకముందు ఖైదీలు సందర్శకులను నేరుగా కలిసే అవకాశం ఉండేది కాదు. కుటుంబ సభ్యులతో ఖైదీలు ఫోనులో మాట్లాడుకునే వీలుతో పాటు సందర్శకులను ఒక ఇనుప జాలీ లేదా అద్దం స్క్రీన్ అవతల నుంచి మాత్రమే కలిసే వీలుండేది.
"జైలులో లేని భాగస్వామిని శిక్షించడంలో అర్ధం లేదు. ఖైదీల ఒత్తిడిని తగ్గించేందుకు, వారు తిరిగి సమాజంలో అడుగుపెట్టేందుకు వీలుగా పంజాబ్ జైలులో భాగస్వాములను సందర్శించేందుకు అనుమతించాం. ఇది దేశంలోనే మొదటి సారి అమలు చేస్తున్న పైలట్ ప్రాజెక్ట్" అని పంజాబ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ (ప్రెజన్స్) హర్ప్రీత్ సిద్ధు చెప్పారు.
ఈ విధానాన్నిసెప్టెంబరు 20న మూడు జైలుల్లో అమలు చేశారు. పంజాబ్ లో మొత్తం 25 జైళ్లు ఉండగా అక్టోబరు 03 నాటికి మొత్తం 17 జైళ్లకు విస్తరించారు.
"భాగస్వామితో సెక్స్ శారీరక అవసరం. భాగస్వాములను ఏకాంతంగా కలిసేందుకు ఈ పథకం అమలు చేసిన మొదటి వారంలోనే మొత్తం 385 అభ్యర్ధనలు వచ్చాయి" అని చెప్పారు.
37ఏళ్ల జోగా సింగ్ ఐపీసీలోని సెక్షన్ 420 కింద నమోదు చేసిన నేరానికి శిక్షను అనుభవిస్తున్నారు. ఆయన కూడా భాగస్వామిని ఏకాంతంగా కలిసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
"కొన్ని నెలలుగా నా కుటుంబాన్ని చూడకపోవడం వల్ల నేను మానసికంగా కుంగిపోతున్నాను. కానీ, నా భార్యను ఏకాంతంగా కలవడం నన్ను ఉత్సాహపరిచింది" అని అన్నారు.
మొదట్లో వీరి పట్ల జైలు సిబ్బంది ఎలా ప్రవర్తిస్తారోననే అనుమానాలు ఉండేవి కానీ, ప్రస్తుతం ఆ అనుమానాలు తీరిపోయాయని చెప్పారు.
- మరణ శిక్ష అమలుకు ముందు ఖైదీలు కోరుకున్న చివరి భోజనం ఏమిటో తెలుసా
- పదేళ్లలోపు పిల్లలు నేరాలు చేస్తే జైల్లో పెట్టాలా? వద్దా?
భార్య భర్తలు ఏకాంతంగా గడిపేందుకు గది
బీబీసీ ప్రతినిధి గోయింద్ వాల్ సాహిబ్ జైలును సందర్శించారు.
మిగిలిన జైలుల మాదిరిగానే ఈ జైలులో ప్రవేశించడానికి కూడా రెండు సార్లు సెక్యూరిటీ తనిఖీలు దాటి వెళ్లాల్సి ఉంటుంది.
ముఖ్య ద్వారం తర్వాత కొన్ని మీటర్లలో మరొక ద్వారం ఉంటుంది. ఈ రెండు ద్వారాలు దాటి వెళ్లిన తర్వాత మొదటి అంతస్తులో భార్యా భర్తలు ఏకాంతంగా గడిపేందుకు ఒక గదిని కేటాయించారు. ఈ గదికి అనుబంధంగా ఒక వాష్ రూమ్ కూడా ఉంది.
గదిలో ఒక డబుల్ బెడ్, ఒక టేబుల్, రెండు కుర్చీలు, ఒక చిన్న స్టూల్, మంచి నీటి కూజా, రెండు గ్లాసులు కూడా అమర్చారు.
వీరిని గదిలో ఉంచి బయట నుంచి తాళం వేస్తామని వారు రెండు గంటల సేపు గదిలో ఏకాంతంగా గడిపేందుకు అనుమతిస్తామని జైలు వార్డెన్ లలిత్ కోహ్లీ బీబీసీకి చెప్పారు.
వారికి ఏదైనా సహాయం అవసరమైతే బెల్ కొడతారని చెప్పారు. సాధారణంగా జంటలు గదిలో ఏకాంతంగా గంట సేపు గడుపుతున్నట్లు చెప్పారు.
ఈ అభ్యర్థనలను ఆమోదించడం లేదా ధిక్కరించే అధికారం జైలు సూపెరింటెండెంట్కు ఉంటుంది. వీరికి కండోమ్లు కూడా ఇస్తారు.
జైలులో ఖైదీల ప్రవర్తనను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి ఖైదీలను సందర్శించేందుకు చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఈ సమయంలో జైలులో అన్ని కిటికీలు, ఎగ్జిట్ పాయింట్లను మూసేస్తారు.
- పాకిస్తాన్లోని అత్యంత కట్టుదిట్టమైన జైలు నుంచి భారత పైలట్లు ఎలా తప్పించుకున్నారు
- నిర్భయ కేసు దోషుల ఉరితీత: శిక్ష ఎలా అమలు చేస్తారు
సెక్స్ కోసం మాత్రమే కాదు
ఈ విధమైన సందర్శనల వల్ల ఖైదీలు తమ భాగస్వాములతో ఏకాంతంగా కొంత సమయం గడిపేందుకు వీలవుతుంది.
పంజాబ్ ప్రభుత్వం విడుదల చేసిన నోట్స్ ప్రకారం ఈ ఏకాంతంగా కలవడాన్ని ఖైదీని తమ భాగస్వామి సందర్శించినప్పుడు ఆ దంపతులు సెక్స్లో కూడా పాల్గొనవచ్చు అని కంజుగల్ విజిట్ను నిర్వచిస్తోంది.
కుటుంబ బంధాలను బలపరుచుకునేందుకు, ఖైదీలు ఉత్తమంగా ప్రవర్తించేందుకు, జైలులో పెట్టడం వల్ల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు, పునరావాస అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు లక్ష్యంగా చేసుకుని ఈ సందర్శనలకు అనుమతించినట్లు జైలు అధికారులు చెబుతున్నారు
"భార్యా భర్తలు జైలులో ఏకాంతంగా కలుసుకునే అనుమతి అమెరికా, ఫిలిప్పీన్స్, కెనడా, సౌదీ అరేబియా, జెర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా ఉంది. కానీ, భారతదేశంలో ఇప్పటి వరకు ఇలాంటి అనుమతిని ఇవ్వడం ఎక్కడా లేదు" అని హర్ప్రీత్ సిద్ధు చెప్పారు.
వైవాహిక బంధాన్ని కొనసాగించేందుకు అప్పుడప్పుడూ ఖైదీలు, వారి కుటుంబాలు కోర్టులకు పరోల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది.
ఈ ఏడాది మొదట్లో పంజాబ్ హర్యానా హై కోర్టు జైలులో ఉన్న తన భర్తను కలిసేందుకు పెట్టుకున్న అభ్యర్ధనను తోసిపుచ్చింది. ఆమె భర్త హత్యా నేరం పై జైలు శిక్షను అనుభవిస్తున్నారు.
2014లో పంజాబ్ హర్యానా హై కోర్టు భార్యా భర్తలు కలిసేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించేందుకు తగిన పథకాన్ని రూపొందించేందుకు జైలు సంస్కరణల కమిటీ ని నియమించాలని ఆదేశించింది.
2021లో హర్యానా ప్రభుత్వం ఏకాంతంగా భాగస్వామిని కలిసేందుకు ఖైదీల హక్కుల కోసం జస్టిస్ హెచ్ఎస్ భల్ల నేతృత్వంలో జైలు సంస్కరణల కమిటీని నియమించింది.
- 'ఖైదీలకు సూర్యరశ్మి సోకకూడదు... కావాలంటే మారణాయుధాలు వాడండి' - జైలర్లకు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడి ఆదేశాలు
- ఎమర్జెన్సీ: 'అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ
ముఠా నాయకులను కూడా భాగస్వాములను కలిసేందుకు అనుమతిస్తారా?
పంజాబీ గాయకుడు శుభ్దీప్ సింగ్ (సిద్దూ మూసేవాలా)ను హత్యారోపణ పై జైలులో ఉన్న 18 మంది నిందితులు గోయింద్వాల్ సాహిబ్ జైలులో ఉన్నారు. ఈ జైలు రాష్ట్రంలో అత్యంత భద్రతతో కూడిన జైలు.
కానీ, దారుణమైన నేరాలకు పాల్పడిన నేరస్థులు, అధిక ముప్పు ఉన్న ఖైదీలకు తమ భాగస్వాములను కలిసేందుకు అనుమతి లభించదని అధికారులు చెబుతున్నారు.
జైలు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు.
ఈ ప్రాజెక్టు కింద ఎవరు దరఖాస్తు చేసుకోలేరు?
అధిక ముప్పు ఉన్న ఖైదీ, తీవ్రవాది, దోపిడీదారులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోలేరు
- చిన్నారులు, లైంగిక నేరాలు, గృహ హింస నేరం పై జైలులో ఉన్నవారు
- టీబీ, హెచ్ఐవీ, ఎస్టీడీ లాంటి అంటువ్యాధులతో బాధపడుతున్న వారు.
- వీరికి జైలు వైద్య ఆరోగ్య అధికారి అనుమతిస్తే దరఖాస్తు చేసుకోవచ్చు.
- గత మూడు నెలల్లో జైలులో ఎటువంటి నేరాలకు పాల్పడని వారు
- గత మూడు నెలల్లో జైలులో తమ విధుల నిర్వహణను సక్రమంగా నిర్వహించని వారు
- జైలులో ఉత్తమ ప్రవర్తన ప్రదర్శించని వారుదరఖాస్తు చేసుకోలేరు.
జైలులో సుదీర్ఘకాలం నుంచి ఉన్నవారికి, ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు లేని వారికి ప్రాధాన్యత ఇస్తారు.
పరోల్ పై జైలులో ఉన్నవారికి ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది. వీరు ప్రతీ కొన్ని నెలలకు ఇంటికి వెళ్లే అవకాశముంటుంది.
జైలులో సౌకర్యాల కల్పన పట్ల విమర్శలు
ఖైదీలకు ఇన్ని సౌకర్యాలు కల్పించడాన్ని సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ విమర్శిస్తున్నారు.
ఈ హత్య కేసులో నిందితులు దీపక్ టిను అక్టోబరు 01 పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయిన తర్వాత నేరస్థులకు జైలు గదుల్లో సౌకర్యాలు కల్పించడం పట్ల ఆమె పంజాబ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
జైలులో ఉన్న ముఠా నాయకుడు లారెన్స్ బిష్ణోయ్కు దీపక్ చాలా సన్నిహితులు. మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్ పై ఛార్జ్ షీట్ నమోదయింది.
జైలులో పడకలు ఏర్పాటు చేసి జైలు గదుల్లో సౌకర్యాలను కల్పించడాన్ని చరణ్ కౌర్ విమర్శించారు.
ఖైదీలు, వారి కుటుంబాలకు మాత్రం ఈ విషయంలో ఎటువంటి ఫిర్యాదులు లేవు. గోయింద్వాల్ జైలులో ఈ పథకాన్ని మొదట ఉపయోగించుకున్న గుర్జీత్ సింగ్ మాత్రం ఈ పథకాన్ని అన్ని జైళ్లకు విస్తరింప చేయాలని అంటున్నారు. ఇది ఖైదీల సంస్కరణలో అతి గొప్ప అడుగు అని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్లు చోరీ అయితే పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?
- కొల్లాపూర్ మహాలక్ష్మి - అంబాబాయి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- బల్లి పడితే ఆహారం విషపూరితం అవుతుందా, ఇంట్లో బల్లులు లేకపోతే మనుషులకు ఏం జరుగుతుంది?
- మీరు డార్క్ చాక్లెట్ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)