అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఏకంగా అసెంబ్లీలో తీర్మానం: ముఖ్యమంత్రి ప్రకటన
చండీగఢ్: ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారి తీసిన పథకం.. అగ్నిపథ్. సైన్యంలో చేపట్టదలచిన నియామకాలకు ఉద్దేశించిన స్కీం ఇది. ఉత్తరాది మొదలుకుని దక్షిణాది రాష్ట్రాల వరకూ చాలా చోట్ల ఈ పథకానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. దీనికి వ్యతిరేకంగా అల్లర్లకు పాల్పడ్డారు నిరుద్యోగులు. రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు. విధ్వంసానికి పాల్పడ్డారు.
Reliance Jio: ముఖేష్ అంబానీ రాజీనామా: 5జీ స్పెక్ట్రమ్ వేలం వేళ: కేవీ చౌదరికి కీలక బాధ్యతలు
తెలంగాణ సహా..
తెలంగాణ, బిహార్, పశ్చిమబెంగాల్, హర్యానా.. వంటి పలు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లపై దాడులు చోటు చేసుకున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరుద్యోగులు రైళ్లకు నిప్పటించారు. ఈ ఘటనలో పలువురిని అరెస్ట్ చేశారు పోలీసులు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకున్న విధ్వంసం వెనుక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆవుల సుబ్బారావు ప్రమేయం ఉన్నట్లు పోలీసులున నిర్ధారించారు. 12 బ్రాంచ్ల అకాడమీ అభ్యర్థులతో వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని, రెండువేల మందికి పైగా ఆందోళనకారులతో విధ్వంసం సృష్టించారని పోలీసులు అనుమానిస్తోన్నారు.
అగ్నిపథ్పై పంజాబ్..
కాగా- ఈ స్థాయిలో నిరసనలకు కారణమైన అగ్నిపథ్ పథకంపై పంజాబ్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయనుంది. త్వరలో నిర్వహించబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం చేస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తెలిపారు. దీన్ని- భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఓ విచిత్రమైన, అహేతుకమైన నిర్ణయంగా అభివర్ణించారు.
సైనిక నియామకాల మూలాలపై దెబ్బ..
సైనిక నియామకాల మూలాన్ని దెబ్బతీసేలా ఉందని భగవంత్ మాన్ విమర్శించారు. భవిష్యత్తులో ఆర్మీలో చేపట్టబోయే నియామకాలన్నింటినీ ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించారు. దీని దుష్ప్రభావం- సైన్యంపై పడే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో జీరో అవర్లో ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా ఈ అంశాన్ని లేవనెత్తారు. సైన్యంలో ఎక్కువ మందిని పంపిస్తోన్న పంజాబ్లో అగ్నిపథ్ పథకం అమలవుతుందా? లేదా? అంటూ అడిగిన ప్రశ్నకు భగవంత్ మాన్ బదులిచ్చారు.
చారిత్రాక తప్పిదాల నిర్ణయాల్లో ఇదీ ఒకటి..
ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చారిత్రక తప్పిదాల నిర్ణయాల సరసన అగ్నిపథ్ కూడా చేరుతుందని భగవంత్ మాన్ అన్నారు. ఈ పథకం గురించి ఏ ఒక్కరికీ సరైన అవగాహన లేదని చెప్పారు. ఆర్మీలో చేరిన నాలుగు సంవత్సరాలకే రిటైర్డ్ అయ్యే పరిస్థితి ఇదివరకెప్పుడూ లేదని చెప్పారు. 21 సంవత్సరాలకే నవ యువకులు రిటైర్ అయ్యేలా చేసిందంటూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ పథకం లక్షలాది మంది యువకులు అన్యాయానికి గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు.