ప్రధాని మోదీకి 30 ఏళ్లుగా రాఖీ కడుతున్న పాకిస్థానీ మహిళ.. ఎవరో తెలుసా..?
రాఖీ పండుగ వచ్చేస్తోంది. దేశవ్యాప్తంగా ఆగస్టు 9 న రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల మధ్య బంధానికి ప్రతీకగా రక్షా బంధన్ నిలుస్తుంది. ఈ రోజున తోబుట్టువులే కాకుండా ఆఫీస్ కొలీగ్స్, ఫ్రెండ్స్ ఇలా ఒకరికి ఒకరు రక్షణగా ఉండాలంటూ రాఖీ కట్టుకుంటారు. రాజకీయ నేతలు సైతం ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళా రాజకీయ నాయకులు.. తమ సోదర సమానుడిగా భావించే నాయకులకు రాఖీలు కడుతుంటారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు పొంది చరిత్ర సృష్టించారు. అంతేకాక ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన నేతగా నయా చరిత్ర లిఖించారు. అయితే పాకిస్థాన్ లోనూ ప్రధాని మోదీకి ఫ్యాన్స్ ఉన్నారు. పాకిస్థాన్లో జన్మించిన ఓ మహిళ సుమారు 30 ఏళ్లుగా మోదీకి రాఖీ కడుతుంది. మోదీని తన సోదరుడిగా భావిస్తూ రాఖీ కడుతుంది. ఆమె ఎవరో కాదు పాకిస్థాన్ కు చెందిన ఖమర్ మోషిన్ షేక్.
పాకిస్థాన్ కు చెందిన ఖమర్ మోషిన్ షేక్ అనే మహిళ ప్రధాని మోదీకి ప్రతి ఏటా రక్షాబంధన్ రోజున రాఖీ కడతారు. పాకిస్థాన్లోని కరాచీలో జన్మించిన ఆమె.. 1981లో వివాహం చేసుకుని ఇండియాకు వలస వచ్చారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరంలో భర్తతో ఉంటున్నారు. అయితే ప్రధాని మోదీ RSS వాలంటీర్ గా ఉన్న సమయంలో ఊహించని విధంగా ఖమర్ మోషిన్ షేక్తో పరిచయం ఏర్పడింది. ఆమె పెయింటింగ్ లో నిష్ణాతులు కావడంతో.. ఆ పెయింటింగ్స్ ను ప్రధాని మోదీ అమితంగా ఇష్టపడేవారు. అలా వారి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం బలపడింది. అప్పటినుంచి ఏటా ఆమె ప్రధాని మోదీకి రాఖీ కడుతూ వస్తోంది.

2001లో ఖమర్ మోషిన్ షేక్ తొలిసారిగా మోదీకి ఆమె రాఖీ కట్టారు. మోషిన్ షేక్ మోదీకి సొంతంగా చేసిన హ్యాండ్ మేడ్ రాఖీలను కట్టేది. ప్రధాని మోదీ కోసం ఈ సారి ఆమె రెండు హ్యాండ్మేడ్ రాఖీలను తయారు చేశారు. ఒకటి వినాయకుడి బొమ్మతో ఉంటే.. మరోటి ఓం గుర్తుని సూచిస్తోంది.












Click it and Unblock the Notifications